సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అస్త్రశస్త్రాలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. గ్రూపు కొట్లాటలతో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓ దారికి తేవడమే కాదు. నేతలను ఓ తాటిపైకి తీసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 14 స్థానాల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి, అందుకు తగినట్టుగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా.. విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టి.. అన్ని అంశాల్లోనూ పైచేయి సాధిస్తున్నారు. కనీసం 14 చోట్ల గెలుపే లక్ష్యంగా ప్రచార పర్వంలో ముందున్నారు. ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి.
ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నా, రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలన్నా.. వచ్చే లోక్సభ ఎన్ని కల్లో అత్యధిక సీట్లు సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కార్యాచరణను అంతా తానై నడిపిస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. అభ్యర్థుల తరఫున ప్రచారాన్నీ తన భుజాలపై వేసుకున్నారు. రాష్ట్రంలోని 17 నియోజక వర్గాల్లోనూ సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్షోలకు హాజరయ్యేలా ప్రణాళికలు రచించారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 3 కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే మహబూబ్నగర్, మహబూబాబాద్, మెదక్, భువనగిరి అభ్యర్థుల తరపున ఒక దఫా సభల్లో పాల్గొన్నారు. అలాగే, రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీతో ప్రచారం చేయించేం దుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మే నెల మొదటి వారంలో నల్లగొండ, భువనగిరిలో ప్రియాంక రోడ్షో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇవాళ్టి నుంచి రేవంత్ మరింత దూకుడు పెంచారు. రోజుకు మూడు చోట్ల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి.