కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయడంతో పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్పై మే 14న విచారణ జరగనుంది.
ఇటీవల 17 ఏళ్ల బాలికను వేధిస్తున్నాడంటూ ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8న హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
బాలికను వేధించడం, అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే మరోవైపు ఈ కేసుపై భగీరథ్ కూడా కౌంటర్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కరీంనగర్ పోలీసులు కూడా అదే రోజు కేసు నమోదు చేశారు.
దీంతో ఈ వ్యవహారం రెండు వైపులా ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరింత వివాదాస్పదంగా మారింది. మరోవైపు పోలీసులు రెండు కేసులపైనా విచారణ కొనసాగిస్తున్నారు. కాల్ రికార్డులు, చాట్ వివరాలు, ఇతర డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం.


