ఏపీలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా అంగన్వాడీ సిబ్బంది ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోవడంతో ఆందోళనలను ఉధృతం చేశారు. ఇవాళ మంత్రుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిన అంగన్వాడీలు.. ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర బైఠాయించి నినాదాలు చేశారు.
గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని మంత్రి విడుదల రజినీ ఇంటిని ముట్టడించారు అంగన్వాడీలు . . తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని… లేదంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
అటు పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు అంగన్వాడీలు. మంత్రి ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటిని అంగన్వాడీలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి ఇంటి ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.
తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహిస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి పదివేల మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి సమీపంలోనే పోలీసులు అడ్డుకోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలను పెంచాలని.. లేదంటే జగన్ను గద్దె దింపుతామని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్వాడీ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.


