కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంపీగా రాహుల్ పై అనర్హత వేటు పడగా.. తాజాగా కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 22లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీచేసింది. ఎంపీగా అనర్హత వేటు పడడంతో ప్రభుత్వ బంగ్లాలో ఉండే అర్హత లేదని తెలిపింది. అలాగే ఎంపీగా రాహుల్ కు వచ్చే వేతనం, అలవెన్స్ లు కూడా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కాగా 2019 ఎన్నికల ప్రచారం సమయంలో దొంగల ఇంటి పేరు మోదీనే ఎందుకుంటోంది అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్ పై పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో నిబంధనల ప్రకారం రాహుల్ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది.