రాష్ట్రంలో కాపు సంక్షేమ సేన కమిటీలన్నీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ప్రకటించారు. పాలకొల్లులో సమావేశమైన కాపు సేన కమిటీ సభ్యులంతా కమిటీ కొనసాగింపు లేదా రద్దు విషయమై పూర్తి అధికారాలు జోగయ్యకు ఇస్తూ తీర్మానం చేశారు. దీంతో వ్యవస్థాపక అధ్యక్షుడైన జోగయ్య మినహా వివిధ హోదాల్లో పనిచేస్తున్న అందరి పదవులు, అన్ని కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి ఎన్నికల అనంతరం కమిటీ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి రద్దు చేసి కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు తనతో పాటు కొందరు కాపు నాయకులు నష్టపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని కాంక్షించారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్తో పాటు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎవరైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న జోగయ్య… తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు.