స్వతంత్ర, వెబ్ డెస్క్: ఢిల్లీ నుంచి బయల్దేరి సాంకేతిక లోపం కారణంగా రష్యాలో ల్యాండ్ అయినా ఎయిర్ ఇండియా విమానం ఎట్టకేలకు అమెరికా సాన్ ఫ్రాన్సిస్కో బయల్దేరింది. దాదాపు 39 గంటల తరువాత విమానం గమ్యస్థానానికి బయల్దేరింది. నిన్న మధ్యాహ్నం ముంబై నుంచి బయల్దేరిన ప్రత్యేక విమానం.. నేటి ఉదయం ప్రయాణికులతో టేకాఫ్ అయ్యినట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విమానంలో 216 మంది ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు.
మగదన్లో నిలిచిన సమయంలో తాము కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. సరైన వసతులు లేని కారణంగా ఈ ప్రయాణికులను బస్సుల్లో పలు ప్రాంతాలకు తరలించారు. అయితే లగేజీలు విమానంలో ఉండటంతో వీరు ఇబ్బందులు పడ్డారు. ఆహారం, ఔషధాలు లేకపోవడంతో పాటు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నామని తెలిపారు. కాగా.. రష్యాలో దిగిన ఈ విమానంపై అమెరికా స్పందించింది. పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ఈ విమానంలో 50 కంటే తక్కువ మందే అమెరికా పౌరులు ఉన్నట్లు వెల్లడించింది.