వరుస కేసులతో ఏసీబీ దూకుడు పెంచింది. హైదరాబాద్ జోన్లోనే రెండు నెలల్లో 20కి పైగా కేసులు నమోదు చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్టీఏ, పోలీస్ శాఖపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తాజాగా హైద రాబాద్ సీసీఎస్ సీఐ సుధాకర్ గౌడ్ని 3లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మఫ్టీలో వచ్చిన అధికారులు రౌండ్ అప్ చేయగా నగదు బ్యాగ్ పక్కకు పడేసి పరుగులు తీశాడు. సీఐ సినీ ఫక్కీని తలపించే ఈ ఘటనపై స్వతంత్ర ప్రత్యేక కథనం .
ఓ చీటింగ్ కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ హైదరాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. బషీర్ బాగ్ ఓల్డ్ పోలీస్ కమిషన రేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలంలో ఈనెల 13న బాధితుల నుంచి డబ్బుల బ్యాగ్ తీసుకుంటుండగా అధికారులు రైడ్ చేశారు. ఈనేపథ్యంలోనే సీఐ సుధాకర్ డబ్బుల బ్యాగ్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. అతన్ని ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఇటీవల ఆదాయాని కి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్రావు కేసును మరువకముందే, మరో ఇన్స్పెక్టర్ భారీ స్థాయిలో లంచం తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. సీఐ సుధా కర్ని అదుపులోకి తీసుకొని మేడిపల్లిలోని తన నివాసంతో పాటు బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహిం చారు. ఆర్థిక నేరాల కేసులను దర్యాప్తు చేసే సీసీఎస్లోని టీమ్-7 ఇన్స్పెక్టర్గా చామకూరి సుధాకర్ ఉన్నా రని ఏసీబీ అధికారులు తెలిపారు. క్రైమ్ నంబర్ 41/2024కు సంబంధించిన చీటింగ్ కేసు దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నారు. యాప్రాల్కు చెందిన వ్యాపారి సీవీఎస్ సత్యప్రసాద్ వ్యాపార విస్తరణ కోసం తన డూప్లెక్స్ ఇంటిని అమ్మే విషయంలో బోయిన్పల్లికి చెందిన మని రంగ స్వామి, హేమ సుందర్రెడ్డి 1.48 కోట్ల రూపాయల మోసం చేశారంటూ సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతను ఉన్నతాధికారులు సుధాకర్కు అప్పగించా రు. నిందితుడైన రంగస్వామిని ఈ కేసు నుంచి బయట పడేసేందుకు ఇన్స్పెక్టర్ సుధాకర్ 15 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు.
15 లక్షల్లో అడ్వాన్స్గా ఇప్పటికే 5 లక్షల రూపాయలు లంచం తీసుకున్నాడు సుధాకర్. మిగతా సొమ్ము ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో రంగస్వామి ఏసీబీని ఆశ్రయించాడు. ఒప్పందంలో భాగంగా రంగ స్వామి 3 లక్షల రూపాయలు లంచం ఇస్తానంటూ సుధాకర్కు హామీ ఇచ్చాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 3 లక్షల రూపాయల నోట్ల కట్టలు బ్యాగ్లో పెట్టుకొని రంగస్వామి బషీర్బాగ్లోని సీసీఎస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలానికి చేరుకున్నాడు. రంగస్వామి ఫోన్ చేయగానే సుధాకర్ అక్కడకు వచ్చి లంచం డబ్బులు ఉన్న బ్యాగ్ను తీసుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ రెడ్హ్యాండెడ్గా ఇన్స్పెక్టర్ను పట్టుకున్నారు. అధికారులను వదిలించుకొని ఆ నగదు బ్యాగ్ను అక్కడే వదిలేసి సుధాకర్ పరారయ్యాడు. వెంటనే ఏసీబీ ఇన్స్పెక్టర్ సతీశ్, కానిస్టేబుళ్లు మున్నా, గోవింద నాయక్, హరికాంత్ రెడ్డి సుధాకర్ను వెంటపడి ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. లంచం డబ్బులు ఉన్న బ్యాగ్ను రికవరీ చేసి చేతి వేళ్లను కెమికల్తో పరీక్షించగా పాజిటివ్ వచ్చింది. సీఐ సుధాకర్ను అరెస్టు చేసి విచారణ జరిపిన తర్వాత నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. నాంపల్లి కోర్టు సీఐ సుధాకర్ గౌడ్కి 14రోజుల పాటు రిమాండ్ విధించింది. లంచం డబ్బులను ఏసీబీకి రికవరీ చేశారు.
ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ అధికారులకు ధైర్యంగా ఫిర్యాదు చేయొచ్చని డీఎస్పీ శ్రీధర్ చెప్పారు. 1064 ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించాలని కోరారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతా మని, ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఏసీబీ అధికారులు సీజ్ చేసిన డబ్బును వారం రోజుల్లోనే తిరిగి ఇస్తామని, అలాగే ఆగిపోయిన పనిలో నిజాయితీ ఉంటే తామే క్లియర్ చేసి ఇస్తామని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.


