స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదు విషయంలో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు.. ఆ వ్యవస్థకు పరువు నష్టం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ పవన్ పైన ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారం పై విచారణాధికారం ఈ కోర్టు పరిధిలోకి ఎలా వస్తుందో స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. ఈ ఫిర్యాదును విజయవాడ న్యాయస్థానం వాపసు చేసింది. ఇప్పుడు కోర్టు నిర్ణయంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి కొనసాగుతోంది.
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ పైన పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి కారణమయ్యాయి. పవన్ వ్యాఖ్యల పైన వాలంటీర్లు నిరసనలు చేపట్టారు. ఇదే వ్యవహారం పైన తాజాగా బగ్గా రంగవల్లి అనే మహిళా వాలంటీర్ విజయవాడ మెట్రో పాలిటిన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసారు. వాలంటీర్ల పరువుకు నష్టం కలిగేలా పవన్ వ్యాఖ్యలు చేసారని..వివధ సెక్షన్ల కింద శిక్షించాలని కోరారు. ఈ ఫిర్యాదును న్యాయస్థానం వాపసు (రిటర్న్) చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు ఈ వ్యాఖ్యలు నిర్దిష్టంగా ఫిర్యాది ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఉన్నాయనేందుకు సరైన దస్త్రాలను సమర్పించాలని సూచించింది.
అటు ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థకు పూర్తి మద్దతుగా నిలిచింది. పవన్ చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ తప్పు బట్టారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. వాలంటీర్ల పైన వ్యాఖ్యలపై లీగల్ గా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పైన పవన్ స్పందించారు. బాధితురాలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురయ్యారని వాలంటీర్ తరపు న్యాయవాదులు తెలిపారు. కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుందన్నారు.
బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కు కోర్టు నోటీసులు ఇస్తుందని తెలిపారు. పవన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. కోర్టు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయని వెల్లడించారు. వాలంటీర్లలో అధికశాతం మహిళలు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఈ ఫిర్యాదును రిటర్న్ చేయటం..సరైన దస్త్రాలను సమర్పించాలని సూచించటంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకోనుంది.