పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ట్రెండ్ మారింది. కార్నర్ మీటింగ్లు, సోషల్ మీడియా పుణ్యమా అని ముక్క, చుక్క కరువైంది. బీరూ, బిర్యానీల జోరు తగ్గింది. ఇంకేముంది సగానికిపైగా ఖర్చు తగ్గడంతో హమ్యయ్యా అని అభ్యర్థులు ఊపిరిపీల్చుకుంటే, సమాజానికి మంచిదేనంటున్నారు ప్రజాస్వామ్యవా దులు. మరి మారిన ఆ ట్రెండ్ ఏంటో సోషల్ మీడియా హవా ఏంటో ఓసారి చూసేద్దామా..
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జాతర జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తగ్గాఫర్ వార్ నడుస్తోంది. పోలింగ్కు సమయం ఆసన్నంకావడంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు నేతలు. అయితే గత ఎన్నికల మాదిరి ముక్క, చుక్కా, బీరూ, బిర్యానీల ట్రెండ్కు ఫుల్స్టాప్ పడింది. మటన్ దావతుల జోరు తగ్గింది. ఒకప్పుడు ఎన్నికలే కొందరికి ఉపాధిగా మారేవి. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం చికెన్ రైస్, బీరూ బిర్యానీ, రాత్రికి మటన్ దావత్ ఇలా ఎన్నికల ప్రచారంలో ఇటు కడుపు నిండేది. అటు రోజువారి కూలీతో జేబు నిండేది. అంతేకాదు. కుల సంఘాలు, మహిళ, యువజన సంఘాల వారి కోసం కమ్యూనిటీ, ఫంక్షన్ హాళ్లు, గుళ్లు, చర్చిలు, మసీదులు అంటూ ఆ ఖర్చు తడిసి మోపడయ్యేది. క్యాండెట్ను ప్రకటించింది మొదలు.. ఓటరు వేలు ఈవీఎం మీద పడే వరకూ కోట్లకు కోట్లు గుమ్మరిం చాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఈ సమయంలో హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు, బై ఎలక్షన్స్ ఓసారి గుర్తు చేసుకుంటే.. గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో అభ్యర్థుల ప్రచార ఖర్చు పీక్ స్టేజికి చేరింది. అంతకు ముందు జరిగిన ఎన్నికలతో పోలిస్తే నాలుగైదు రెట్లు పెరిగింది. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎనికల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు 50 నుంచి 100 కోట్లు ఖర్చు చేసినట్టు టాక్. అయితే, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార శైలి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా, కార్నర్ మీటింగ్లతో ఆ ట్రెండ్ మారిందని. సగానికిపైగా ఖర్చు తగ్గిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
మానవ మనుడలో ఫోన్ ఒక భాగమైపోయాక ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా దుమ్మురేపుతోంది. ఒకప్పుడు పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార రథాలే ఆధారం. కానీ టెక్నాలజీ పెరిగాక సామాజిక మాద్యమాలు ప్రచార వేదికలుగా మారిపోయాయి. అందుకే సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టాయి పార్టీలు. ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మెసేజ్ల మోత మోగిస్తున్నారు. ఏ విషయమైనా సరే నిమిషాల్లో అప్లోడ్ కావడంతో వంద గ్రూపులు, వేల పోస్టులు అన్నట్టు సాగుతోంది ప్రచారం. అభ్యర్థి చేసే రాజకీయ కార్యక్రమాలతోపాటు, ప్రత్యర్థిని ఎండగట్టేందుకు సోషల్ మీడియా హవాను వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఇంకేముంది తాము చెప్పాల్నినదంతా నిమిషాల్లో వేల మందికి చేరిపోతుంది. చర్చలు, విమర్శలకు నెట్టిల్లు వేదికవుతోంది.
ఇక ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో అభ్యర్థులు రూటు మార్చారు. కేవలం బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లతో సరిపెడుతున్నారు. భారీ బహిరంగ సభలకు వేలాదిగా జనాన్ని తరలించాలంటే కోట్లలో ఖర్చు పెట్టక తప్పదని భావించిన పార్టీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఒకటి రెండు సభలతో సరిపెట్టుకుని, కార్నర్ మీటింగ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికలు కావడంతో లోకల్ సమస్యలను పక్కన పెట్టి జాతీయ అంశాలపైనే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపైకి పెద్దగా జనాలను తరలించాల్సిన అవసరం లేదన్న భావనతో అభ్యర్థులు ఖర్చును ఆదా చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరోపక్క ఎన్నికల్లో ఖర్చు తగ్గించడం మంచిదేనంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. మరి మారిన ట్రెండ్కు ఓటర్లు ఆకర్షితులవుతారా..? సోషల్ మీడియా పోస్టులతో అభ్యర్థులు గెలిచేస్తారా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.


