కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదు అయింది. పార్లమెంట్ ప్రాంగణంలో నిన్న చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతల ఫిర్యాదుతో రాహుల్ గాంధీపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలకు ఇండియా కూటమి నేతలు నిరసన కార్యక్రమం చేపట్టగా, పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్డీయే, ఇండియా కూటమి పక్షాల ఎంపీల మధ్య తోపులాట జరిగింది.
ఈ ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్పుత్ గాయపడ్డారు. ఈ ఇద్దరు ఎంపీలకు ఢీల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఐసీయులో చికిత్స అందించారు. అయితే… తమ పార్టీ ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీయే బాధ్యుడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంత్ జోషి, అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్ పై కేసు నమోదు చేయాలని కోరారు. బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ గాంధీ తదితరులపై బీఎన్ఎస్ సెక్షన్ 115, 117, 131, 351 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.