MLC Kavitha |ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణలో సీబీఐ, ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న అనేకమందిని ఈ రెండు సంస్థలు విచారిస్తున్నాయి. మనీలాండరింగ్కు సంబంధించి ఈడీ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తుండగా.. మార్చి 20వ తేదీన తమ ముందు విచారణకు హాజరుకావాలని కవితను ఈడీ ఆదేశించింది. అయితే కవిత విచారణకు హాజరవుతారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఈడీ విచారణకు హాజరుపై సస్పెన్స్కు తెరదించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈడీ విచారణకు కవిత హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. హాజరుపై రాత్రి నుంచి న్యాయనిపుణులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
సుదీర్ఘ చర్చల అనంతరం విచారణకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లారు. ఈడీ కార్యాలయానికి వెళ్లడానికి ముందువరకు సీఎం కేసీఆర్ ఢిల్లీ నివాసంలో కవితతో పాటే మంత్రి కేటీఆర్, సంతోష్ సహా ఇతర నేతలు ఉన్నారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం, ఈడీ ఆఫీస్ ఎదుట భారీగా పోలీసుల మోహరించారు. వాదనలు వినకుండా, ముందస్తు ఆదేశాలు జారీ చేయొద్దంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఈడీ కేవియట్ పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్రపిళ్లై కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. కవిత ఈడీ విచారణకు హాజరైతే పిళ్లైతో కలిపి విచారించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.