హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ సంచలన ఘటనలో ప్రధాన నిందితుల్లో ఒకరైన నేపాలీ గ్యాంగ్ సభ్యుడు సునీల్ ను ముంబయిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక బృందాలు పలు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టగా, చివరకు నిందితుడి ఆచూకీని గుర్తించి అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం… హత్య అనంతరం నిందితుల గ్యాంగ్ ఖాజీపేట వద్ద రైలులో దిగినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారు తమ వద్ద ఉన్న నగదు, విలువైన వస్తువులను పరస్పరం వాటాలుగా పంచుకుని వేర్వేరు ప్రాంతాలకు పారిపోయినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్, ప్రయాణ వివరాలను పోలీసులు విశ్లేషించినట్లు తెలుస్తోంది.
ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సునీల్ పర్యార్ను ముంబయిలో అదుపులోకి తీసుకున్న అనంతరం, అతడిని ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకురావడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతడి విచారణ ద్వారా కేసులో పాల్గొన్న ఇతర నిందితుల వివరాలు, హత్య వెనుక అసలు ఉద్దేశాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలో మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.


