పోక్సో కేసులో బండి భగీరథ్ కు షాక్ తగిలింది. బండి భగీరథ్ ను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
తదుపరి ఆదేశాలు వెకేషన్ కోర్టు రోజున ఇస్తామని కోర్టు తెలిపింది. ఈ కేసులో వచ్చే గురువారం తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.
అంతవరకు స్టేటస్ కో కొనసాగించాలని నిందితుడి తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. అయితే అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు ఈ దశలో అంగీకరించలేదు.
కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
కోర్టులో అర్ధరాత్రి వరకు వాదనలు
అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదులో ఉన్న వివరాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
డిసెంబర్ 31న తన కుమార్తెను రెండు రోజుల పాటు ఫామ్హౌస్లో ఉంచారని ఫిర్యాదులో పేర్కొన్నారని ఆయన తెలిపారు. అక్కడ బలవంతంగా ఆల్కహాల్ తాగించారని ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఫామ్హౌస్లో బాధితురాలు, నిందితుడు సహా మరో ఐదుగురు ఉన్నారని ఫిర్యాదులో ఉందని కోర్టుకు వివరించారు.
అయితే స్నేహితులు తీసిన ఫోటోలు పరిశీలిస్తే బాధితురాలు స్వచ్ఛందంగానే ఆల్కహాల్ తీసుకున్నట్లు కనిపిస్తుందని ఆయన వాదించారు. తన క్లయింట్ను కించపరచడం ఉద్దేశం కాదని, కానీ ఆయనపై వస్తున్న దుష్ప్రచారంపై స్పష్టత ఇవ్వడానికే ఈ విషయాలు చెబుతున్నామని తెలిపారు.
అవసరమైతే తమ వద్ద ఫోటోలు, వీడియోలు ఉన్నాయని కూడా న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు బాధితురాలిని భగీరథ్ మానసికంగా, శారీరకంగా వేధించాడని ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
బాధితురాలి తల్లికి ఈ విషయం తెలిసిన వెంటనే ఫిర్యాదు ఎందుకు చేయలేదని ఆయన కోర్టులో ప్రశ్నించినట్లు సమాచారం.


