దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల వినియోగం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించే దిశగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని నిర్ణయించింది.
సీఎం రేఖా గుప్తా (Rekha Gupta) ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఇంధన పొదుపును లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
సీఎం కాన్వాయ్లో వాహనాల సంఖ్యను 60 శాతం వరకు తగ్గించారు. ఇకపై ముఖ్యమంత్రి కాన్వాయ్లో రెండు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించనున్నారు.
ప్రతి సోమవారం “మండే మెట్రో” పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు మంత్రులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు మెట్రో రైళ్లలోనే ప్రయాణించాల్సి ఉంటుంది.
అదే విధంగా వారంలో ఒకరోజు “నో వెహికల్ డే” పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ను 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రభుత్వ ఖర్చులను తగ్గించే భాగంగా ఏడాది పాటు విదేశీ పర్యటనలను పూర్తిగా రద్దు చేశారు.


