బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(K. T. Rama Rao) తో భారతదేశంలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్( Philip Green) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్గీచీ (Hilary McGeachy) కూడా పాల్గొన్నారు.
హైదరాబాద్లోని నందినగర్లోని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలు, భవిష్యత్ సహకార అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, విద్యా రంగంలో కొత్త భాగస్వామ్యాలపై చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఇన్నోవేషన్ రంగాలపై కేటీఆర్ ప్రత్యేకంగా వివరించినట్లు తెలుస్తోంది.
గతంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో కేటీఆర్… హైదరాబాద్ను అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దిన అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ-ఆస్ట్రేలియా మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అయితే స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉన్న బలమైన మైత్రి సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా చర్చలు సాగినట్లు సమావేశ వర్గాలు తెలిపాయి.
ఆస్ట్రేలియా ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంపై సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్… ఈ భాగస్వామ్యం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు సాంస్కృతిక బంధాలను కూడా మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


