ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక్క అమరావతికే పరిమితం కాదని, విశాఖపట్నాన్ని కూడా విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( N. Chandrababu Naidu) అన్నారు. రాజధాని ప్రాంతంలో కిమ్స్ ఆసుపత్రి వైద్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడారు.
రాయలసీమను రత్నాల సీమగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం పేర్కొన్నారు. అనంతపురాన్ని ఏరోస్పేస్ హబ్గా, తిరుపతిని ఏరోస్పేస్ సిటీగా, కర్నూలును డ్రోన్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే శ్రీసిటీ ఇప్పటికే ప్రముఖ ఇండస్ట్రియల్ హబ్గా ఎదిగిందని చెప్పారు.
2027 మే 13 నాటికి కిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని.. 2028 ఆగస్టు 15కి ముందే గూగుల్ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. ఆర్సెల్లార్ మిత్తల్ సంస్థకు 2028 డిసెంబర్ నాటికి ఫేజ్-1 పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
రాష్ట్రంలో లక్ష మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో ప్రపంచంలోని ప్రతి ముగ్గురు వైద్యుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండేలా వైద్య విద్యను అభివృద్ధి చేస్తామని అన్నారు. వైద్య రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాధాన్యం పెరుగుతోందని, వైద్యులు కూడా AI నేర్చుకుంటున్నారని తెలిపారు.
అమరావతిని దేశంలో క్వాంటం కంప్యూటింగ్కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆ దిశగా కీలక అడుగులు పడతాయని వెల్లడించారు.
గ్రీన్ ఎనర్జీ, వర్క్ ఫ్రమ్ హోమ్పై దృష్టి
విదేశీ ఇంధనాలపై ఆధారపడకుండా రాష్ట్రంలోనే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి ఇంటి పైకప్పుపై, ప్రతి వ్యవసాయ పొలంలో సోలార్ రూఫ్టాప్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడిందని పేర్కొన్న చంద్రబాబు.. భవిష్యత్తులో ప్రభుత్వ వ్యవస్థలో కూడా “వర్క్ ఫ్రమ్ హోమ్” విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.
అధికారిక కాన్వాయ్లలో అధిక సంఖ్యలో వాహనాలు ఉపయోగించడం అవసరం లేదని, భద్రత అర్థవంతంగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి
విదేశాలకు వెళ్లే బదులు దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు, పాపికొండలు, గండికోట వంటి ప్రాంతాలు అద్భుతమైన పర్యాటక కేంద్రాలని చెప్పారు. భవిష్యత్తులో సూర్యలంకను గోవాకు పోటీగా నిలిచే టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని( Pemmasani Chandrasekhar) తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


