పెదపాడు పాఠశాలకు కొత్త భవనం
అడవితల్లి బాట ప్రారంభోత్సవంలో ఇచ్చిన మాట అమలు
రూ. 17.50 లక్షలతో భవన నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పెదపాడు గ్రామంలో రూ.17.50 లక్షల వ్యయంతో నిర్మించిన కొత్త పాఠశాల భవనం అందుబాటులోకి వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
గత ఏడాది ఏప్రిల్ 7న అరకు నియోజకవర్గ పరిధిలోని డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో నిర్వహించిన “అడవితల్లి బాట” కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాపరాయి నుంచి పెదపాడు వరకు రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం గ్రామంలోని మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు.
అప్పుడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన పవన్ కల్యాణ్, అక్కడి భవనం శిథిలావస్థలో ఉండటాన్ని గమనించారు. కొత్త పాఠశాల భవనం నిర్మించాలని ఉపాధ్యాయుడు రంగయ్య కోరగా, సభావేదికపైనే కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు ఇప్పుడు ఆధునిక సదుపాయాలతో పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేశారు. 2026 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఈ భవనం అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్కు పెదపాడు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.


