పశ్చిమ బెంగాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అక్కడి ప్రజలు సంకల్పంతో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. అదే విధమైన ప్రజా మద్దతు, ఉత్సాహం ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపిస్తోందని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ, ‘‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని ఆయన అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పేర్కొంటూ, బెంగాల్లో ఓడిపోయింది ఒక రాజకీయ పార్టీ కాదని, రాజ్యాంగ వ్యతిరేక శక్తులేనని వ్యాఖ్యానించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలకు ప్రజలు అక్కడ గట్టి బుద్ధి చెప్పారని తెలిపారు.
తెలంగాణ ప్రజలు కూడా అదే తరహాలో బీజేపీకి ఆశీర్వాదం ఇవ్వాలని మోదీ కోరారు. ‘‘పశ్చిమ బెంగాల్లో విజయం సాధించాం.. ఇప్పుడు మా తదుపరి లక్ష్యం తెలంగాణ. ఈసారి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోందని, బీజేపీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతోందని అన్నారు.


