కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన మాటలు కేంద్రమంత్రి స్థాయికి తగినవి కావని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని ప్రస్తావిస్తూ, సీబీఐ దర్యాప్తు విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. గతంలో ఇదే బండి సంజయ్( Bandi Sanjay Kumar), కిషన్ రెడ్డి (G. Kishan Reddy సీబీఐ విచారణ కోరారని, కేంద్ర నాయకులు కూడా దీనిపై స్పందించారని గుర్తు చేశారు. 48 గంటల్లో విచారణ చేపడతామని చెప్పినా, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.ఎనిమిది నెలలు గడిచినా సీబీఐ దర్యాప్తు ప్రారంభం కాకపోవడం వెనుక రాజకీయ ఒప్పందాలే కారణమని ఆరోపించారు. బీజేపీ–బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, అదే కారణంగా కేసులు ముందుకు సాగడం లేదని అన్నారు. కేసీఆర్ (K. Chandrashekar Rao)పై బీజేపీ గతంలో అవినీతి ఆరోపణలు చేసినా, ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ సహకారం ఉందని కూడా విమర్శలు వచ్చాయి. హరీష్ రావు మద్దతు లేకుండా బీజేపీకి ఓట్లు వచ్చాయా అని ప్రశ్నించారు. ప్రజలకు ఈ రాజకీయ సమీకరణాలు స్పష్టంగా అర్థమవుతున్నాయని పేర్కొన్నారు. ఇక రైతు సమస్యలపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మొక్కజొన్న సహా ఇతర పంటలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నామని, ఇది రైతులకు మేలు చేసే నిర్ణయమని పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.
ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో ఓట్ల తొలగింపు, జోడింపు వంటి అంశాల్లో బీజేపీ పాత్రపై సందేహాలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో కూడా ఓటు హక్కుపై ముప్పు ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే మమతా బెనర్జీ( Mamata Banerjee), అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal)పై కేసులు పెట్టిన బీజేపీ, కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో, సీబీఐ విచారణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ అంశంపై ఉద్యమాలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.


