ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తర్వాత వాయిదా పడనున్నాయి. ఈ నెల 28న ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అదేరోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది.
అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల రీత్యా పాస్లు ఉన్నవారికే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఉండనుంది. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్లతో పాస్ల జారీ చేయనున్నారు. అసెంబ్లీ ఒకటో గేట్ నుంచి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలను మాత్రమే అనుమతించనున్నారు. అసెంబ్లీ గేట్ 2 నుంచి మంత్రులకు, అసెంబ్లీ గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అనుమతి ఉండనుంది.
అయితే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ తమ సభ్యులతో సభకు వస్తోంది ప్రజా సమస్యలపై చర్చకు కాదని… సభ్యత్వాన్ని కాపాడుకోవడానికంటూ అధికారపక్షం ఆరోపిస్తోంది. 60రోజులు వరుసగా పని దినాలకు సభకు హాజరుకాకపోతే సభ్యత్వాన్ని రద్దు చేసే హక్కు ఉన్నట్లు నిబంధన ఉంది. ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం వరుసగా 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దు చేయొచ్చు అంటూ నిబంధన ఉందని ఉండడంతో.. జగన్ సమావేశానికి హాజరు అవుతున్నారని అధికారపక్షం ఆరోపిస్తోంది.
ఇక గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏ అంశాలపై చర్చించాలి.. అనేదానిపై అజెండాను సిద్ధం చేయనుంది. మరోవైపు.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ నిర్వహించారు. సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా సరే.. జనసేన పార్టీ సభ్యులు సంయమనం కోల్పోవద్దు అన్నారు. సభలో హుందాగా వ్యవహరించాలని.. బురదలో కూరుకుపోయిన వైసీపీ సభ్యులు దాన్ని మనకూ అంటించాలని చూస్తారన్నారు. చట్టసభల్లో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో జనసేన పార్టీ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.