ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక అడుగులు వేస్తోంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. పౌరసేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్ ద్వారా ప్రభుత్వం ఎన్ని సేవలను అందుబాటులోకి తెచ్చింది?. ఒకేసారి ఎంత మందికి సమాచారం చేరుతుంది..? వాట్సప్ సేవలపై లోకేష్ చేసిన కామెంట్స్ ఏంటి..?
ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రజల కోసం మన మిత్ర పేరుతో వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇక నుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ వాట్సప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వాట్సప్ సేవల కోసం నెంబర్ను విడుదల చేశారు.
దీంతో దేశంలోనే ఏపీ ప్రభుత్వం తొలిసారి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించనుంది. మొదటి విడతలో 161 సేవలను వాట్సప్ ద్వారా అందించనున్నారు. తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు అందిస్తారు. వాట్సప్ సేవలతో ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నారు.
ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని పౌరులకు చేరవేయాలంటే..ఈ వాట్సప్ ఖాతా ద్వారా సందేశాలు పంపిస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్తు సబ్స్టేషన్ల మరమ్మతులు, వైద్యారోగ్య, వ్యవసాయంతో పాటు అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి అందిస్తారు.
ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే..ఈ వాట్సప్ నంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుందని చెప్పారు. అందులో పేరు, ఫోన్ నంబర్, చిరునామా తదితరాలు పొందుపరిచి, వారి వినతిని టైప్ చేయాలన్నారు. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబరు వస్తుందని..దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంత వరకూ వచ్చింది. ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చని చెప్పారు. ఎలాంటి సమస్యనైనా ఇక్కడ విన్నవించొచ్చని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. పథకాల ద్వారా కలిగే లబ్ధి తదితర అంశాలన్నింటి గురించి వాట్సప్ నంబరుకు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సప్లో పంపిస్తారని..కావాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని టికెట్లు, వసతి సహా అన్నీ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్లు, వసతి బుక్ చేసుకోవడం, విరాళాలు పంపటం వంటివి చేయొచ్చని స్పష్టం చేశారు.
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నో ఎర్నింగ్.. ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సప్ ద్వారా పొందవచ్చు. ముఖ్యమంత్రి సహాయనిధికి చేసిన దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవచ్చన్నారు. విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి ఈ అధికారిక వాట్సప్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. ట్రేడ్ లైసెన్సులు, రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, సర్వీసు, రిఫండ్, ఫీడ్బ్యాక్ తదితర సేవలు దీని ద్వారా పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఎలాంటి సమస్యనైనా వాట్సప్ ద్వారా విన్నవించొచ్చని మంత్రి లోకేష్ తెలిపారు. ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికినట్లు అయిందని చెప్పారు.


