ఏపీకిపెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. రెండో రోజూ వరుస సమావేశాలతో బిజీగా గడిపారు. అందులో భాగంగా 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీల్లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ – గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సు, రౌండ్ టేబుల్ వంటి సమావేశాలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్తోనూ సీఎం భేటీ అయ్యారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన సీఎం.. ఇవాళ వెల్స్పన్ చైర్మన్ బీకే గోయింకా, కార్ల్స్బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్మార్ట్ ప్రెసిడెంట్-సీఈవో కాత్ మెక్లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చర్చించారు. బూమ్బెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు.
ఇక ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్తో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్ను కోరారు.
అంతకుముందు జ్యూరిచ్ తెలుగు కమ్యూనిటీ అధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా భాగమయ్యారు. ప్రపంచ వేదికపై తెలుగు సంస్కృతి వృద్ధి చెందడం చూసి తన హృదయం గర్వంతో నిండిపోతోందని, విశేషమైన కృషి, స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ప్రగతిని సాధిస్తూ తెలుగు వ్యక్తులు ప్రపంచ నాయకులుగా ఎదుగుతున్నారని సీఎం ఈ సందర్భంగా కొనియాడారు.
ఐటీ వచ్చాక హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరిగిందని.. గత 25 ఏళ్లలో ఎన్నో మార్పులు సంభవించాయని అన్నారు సీఎం చంద్రబాబు. స్విట్జర్లాండ్ లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు ప్రసంగించారు. 1991లో ఆర్థిక సంస్కరణలతో భారత్లో ఎన్నో మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దామని.. ఇది చూశాక భవిష్యత్లో తన కలలు కచ్చితంగా నెరవేరతాయనే నమ్మకం పెరిగిందని చంద్రబాబు అన్నారు.
మొత్తానికి దావోస్ వేదికగా ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు బృందం తీవ్రంగా కృషి చేస్తోంది. అటు పారిశ్రామిక వేత్తలు కూడా ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. దావోస్ టూర్ ముగిసే లోగా మరిన్ని కంపెనీలు ఏపీకి తరలి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.


