వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, డయాలసిస్ పేషట్స్కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూలై ఒకటిన పెంచిన పెన్షన్లు ఇంటింటికీ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పెన్షన్ ఇంటికే అందజేసింది. మరి కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం లబ్ధిదారులకు పెన్షన్ ఎలా అందజేస్తోంది..? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? వాచ్ దీస్ స్టోరీ.
ఏపీలో పెన్షన్ల పంపిణీపై కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 4వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థతో కాకుండా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా, పెన్షన్ల పంపిణీకి సంబంధించి కాల పరిమితితో సహా మార్గదర్శకాల ను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టే వృత్తివారు, ట్రాన్స్జెండర్లు, ఏఆర్టీ, డప్పు కళాకారులు, ఆర్టిస్టు పెన్షన్దారులకు 3 వేల నుంచి 4 వేల రూపాయలకు పెంచారు. దివ్యాం గులు, కుష్టురోగులకు 3 వేల నుంచి 6 వేల రూపాయలకు పెంచారు. పూర్తి వైకల్యం ఉన్న వారికి 5 వేల నుంచి 15 వేల రూపాయలకు, తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, కిడ్నీ, లివర్, గుండె ట్రాన్స్ప్లాంట్ చేయించు కున్నవారు, డయాలసిస్ రోగులు తదితరులకు 5 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచారు.పెంచిన పెన్షన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో జూలై 1న ఒక్కో పెన్షన్ దారుడు 7 వేల రూపాయలు పొందే అవకాశం ఉంది. అనంతరం ప్రతి నెలా 4 వేల రూపాయల పెన్షన్ అందుకోనున్నారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికెళ్లి పంపిణీ చేస్తారు. ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేస్తారని, కలెక్టర్లు, అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
పెన్షన్ల పంపిణీపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. పెంచిన పెన్షన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఇచ్చిన హామీని సీఎం చంద్ర బాబు నెరవేర్చారని, జులై 1న పెంచిన పెన్షన్లను ఇస్తామని ఆయన తెలిపారు. 3వేల పెన్షన్ను 4 వేల రూపాయలకు పెంచారన్నారు. అలాగే మూడు నెలల బకాయిలు కలిపి 7 వేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని తెలిపారు. వీటి కోసం ప్రభుత్వ ఉద్యోగులే ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పారు.ఇదిలా ఉంటే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి జీతాలను కూడా రెట్టింపు చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే వారిని పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వాలంటీర్ల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. వాలంటీ ర్లను కొనసాగిస్తారా, తొలగిస్తారా అనే దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రభుత్వ నిర్ణయంతో వాలంటీర్ వ్యవస్థ ఆందోళనలో పడింది. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టడంతో రానున్న రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా..? లేదా అనే సందిగ్ధంలో వాలంటీర్లు ఉన్నారు.


