కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో ఈనెల ఏడోతేదీన పోలింగ్ జరగనుంది. ముంబై మరాఠాలు, హైదరాబాదీల ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తర కర్ణాటకలో ఈ 14 సెగ్మెంట్లున్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడి మొత్తం 14 సెగ్మెంట్లలో బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. ఈసారి కూడా అదే లక్ష్యంతో దూసుకుపోతోంది కమలం పార్టీ.
ముంబై మరాఠాలు, హైదరాబాదీల ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తర కర్ణాటకలోని 14 లోక్సభ నియోజకవర్గాల్లో ఈనెల ఏడో తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. 1991 నుంచి ఉత్తర కర్ణాటకలో బీజేపీ పాగా వేయడం మొదలెట్టింది. దక్షిణ కర్ణాటకతో పోలిస్తే ఉత్తర కర్ణాటకలో ఈసారి ఎక్కువ మంది సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. మొత్తం ఎనిమిది మంది సిట్టింగ్ ఎంపీలు ఉత్తర కర్ణాటకలో మరోసారి టికెట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఓ మాజీ స్పీకర్ పోటీ పడుతున్నారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై హవేరీ సెగ్మెంట్ నుంచి పోటీలో ఉన్నారు. కాగా మరో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టార్ బెళగావి నుంచి బరిలో ఉన్నారు. అలాగే మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై హవేరీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. యడ్యూరప్ప కు వీర విధేయుడిగా బస్వరాజ్ బొమ్మైకు పేరుంది. సహజంగా హవేరీ సెగ్మెంట్లో లింగాయత్ల ఆధిపత్యం ఎక్కువ. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన బస్వరాజ్ బొమ్మై విజయంపై ధీమాతో ఉన్నారు. హవేరీ సెగ్మెంట్లో కాంగ్రెస్ టికెట్పై ఆనందస్వామి గడ్డదేవర బరిలో ఉన్నారు. బెళగావి నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత జగదీశ్ శెట్టార్ పోటీ చేస్తున్నారు. 2004 నుంచి బెళగావి నియోజకవర్గంలో కమలం పార్టీ బలోపేతమైంది. కర్ణాటక రాజకీయాల్లో జగదీశ్ శెట్టార్ సీనియర్ నేత. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2012 నుంచి 2013 వరకు దాదాపు పదినెలల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా జగదీశ్ శెట్టార్ పనిచేశారు. బెళగావిలో లింగాయత్ సామాజికవర్గం ఎక్కువ. శెట్టార్ కూడా అదే సామాజికవర్గానికి చెందినవారు. దీంతో విజయంతో భరోసాతో ఉన్నారు శెట్టార్. కాగా బెళగావిలో కాంగ్రెస్ టికెట్పై మృణాళ్ హెబ్బాల్కర్ పోటీ చేస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై పోటీలో ఉన్నారు. విశ్వేశ్వర హెగ్డే సీనియర్ రాజకీయవేత్త. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత ఆయనది. అంతేకాదు ఉత్తర కన్నడ నియోజకవర్గంలో అందరికీ తెలిసిన వ్యక్తి విశ్వేశ్వర హెగ్డే. ఉత్తర కన్నడ నియోజకవర్గ సమస్యలన్నీ తనకు తెలుసు అంటున్నారు విశ్వేశ్వర హెగ్డే. కాగా ఉత్తర కన్నడ నుంచి కాంగ్రెస్ టికెట్పై అంజలీ నింబాల్కర్ బరిలో ఉన్నారు. కర్ణాటకలోని శివమొగ్గ నియోజక వర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కన్నడనాట బీజేపీకి పునాదులు వేసిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప పెద్ద కుమారుడు బీవై రాఘవేంద్ర ఈసారి శివమొగ్గ సెగ్మెంట్ నుంచి బరిలో ఉన్నారు. యడ్యూరప్ప చిన్న కుమారుడైన ఇప్పటికే బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప మరో కుమారుడికి శివమొగ్గ టికెట్ ఇవ్వడంపై బీజేపీలో పలువురు సీనియర్లు అభ్యం తరా లు వ్యక్తం చేస్తున్నారు.
బీవై రాఘవేంద్రకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ బహిష్కృత నేత ఈశ్వరప్ప ఇండిపెండెంట్గా బరిలో నిలబడ్డారు. లింగాయత్లు, అహిందలు సమానంగా ఉండే శివమొగ్గ నియోజకవర్గంలో కురుబ సముదాయానికి చెందిన ఈశ్వరప్ప, బీజేపీ అభ్యర్థి రాఘవేంద్రకు గట్టి పోటీ ఇస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో రాఘవేంద్రను గెలిపించుకోవడం యడ్యూరప్పకు ప్రతిష్టాత్మకంగా మారింది. 2009 నుంచి శివమొగ్గ నియోజకవర్గం యడ్యూరప్ప కుటుంబానికి దుర్భేద్యమైన కోటలా మారింది. ఈ కారణం తో రాఘవేంద్ర గెలుపుపై ధీమాతో ఉన్నారు యడ్యూరప్ప. అలాగే ఈసారి అందరినీ ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం కలబురిగి. ఇక్కడ్నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. 2019 లో తొలిసారి కలబురిగి నుంచి ఖర్గే పరాజయం పాలయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా బిజీగా ఉండటంతో ఈసారి పోటీకి ఆయన దూరంగా ఉన్నారు. తన తరఫున అల్లుడు రాధాకృష్ణ దొడ్డమనిని పోటీకి నిలబెట్టారు. కలబురిగి నుంచి ఈసారి బీజేపీ టికెట్పై ఉమేశ్ జాదవ్ బరిలో ఉన్నారు. ఉమేశ్ జాదవ్ ఎవరో కాదు…మల్లికార్జున ఖర్గే మార్గదర్శకత్వంలో ఎదిగొచ్చిన నాయ కుడు. ఒకనాటి తన శిష్యుడే ప్రస్తుతం అల్లుడిపై పోటీ చేయడాన్ని ఖర్గే జీర్ణించుకోలేకపోతున్నారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ధార్వాడ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. అయితే లింగాయత్ మఠాధిపతులు జోషిపై తిరుగుబాటు చేశారు దీంతో ధార్వాడ సెగ్మెంట్లో పోటీ అందరినీ ఆకట్టుకుం టోంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వినోద్ అసోటీ, రాజకీయాలకు కొత్త. దీంతో, గెలుపుపై భరోసాతో ఉన్నారు ప్రహ్లాద్ జోషి. కిందటిసారి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 14 నియోజకవర్గాలను క్లీన్స్వీప్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఈసారి కూడా 2019 నాటి ఫలితాలే రిపీట్ అవుతాయని కమలం పార్టీ ఆశిస్తోంది. అయితే 2023 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలను పునరావృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.


