పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ శాతం తగ్గనుందా..? ఎమ్మెల్యేకిచ్చిన ప్రాధాన్యత ఎంపీకి ఇవ్వడం లేదా…? ప్రచారం ఆ స్థాయిలో జరగడం లేదా.., ప్రజలు పట్టించుకోవడం లేదా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇంతకీ ఓటింగ్ శాతం ఎందుకు తగ్గనుంది..? ఎమ్మెల్యేకి, ఎంపీకి మధ్య వ్యత్యాసమేంటి..? అసలు ఓటరన్న మదిలో ఉన్నదేంటి..? వాచ్ దిస్ స్టోరీ..
పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో ఓటింగ్పై దృష్టి సారించారు అధికారులు. అయితే,.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గనుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. శాసనసభ ఎన్నికలకు ఉండే క్రేజ్ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించదని… ఓటరు అంతగా ఆసక్తి చూపరని వారు చెబుతున్న మాట. అందుకు వేర్వేరు సమయాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగడం, ఎండల తీవ్రత, సుదూర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడమే కారణాలుగా తెలుస్తోంది.
తెలంగాణలో శాసనసభ ఎన్నికలతో పోలిస్తే.. పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గుతోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు 73.74 శాతం నమోదు కాగా.. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికలకు 62.77 నమోదుతో 11 శాతం ఓటింగ్ తగ్గింది. దీంతో గతంలో మాదిరే ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గే అవకాశముందం టున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండుసార్లు కూడా ఇదే పద్దతిని ఫాలో అయింది గత కేసీఆర్ సర్కార్. 2014లో జమిలి ఎన్నికలు జరిగగా.. ఆ తర్వాత 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరగగా.. ఆ తర్వాత ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ పరిణామాలతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందో తేలిపోవడంతో.. ప్రజలు పార్లమెంట్ ఎన్నికలపై అంత ఇంట్రస్ట్ పెట్టలేదు. అలాగే ఎమ్మెల్యేల స్థాయిలో ఎంపీ అభ్యర్థుల కూడా ప్రచారం జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం, డబ్బు, మద్యం పంపిణీ ఓటరన్నను పోలింగ్ బూత్కు తరలివచ్చేలా చేశాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ స్థాయిలో ప్రచారం కానీ, ప్రలోభాలు కానీ జరగలేవు. దీనికి తోడు సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను తరలించడంలోనూ ఎంపీ అభ్యర్థులు విఫలమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుతో ఓటరుకు ఆసక్తి తగ్గింది. దీనికి తోడు ఎండ తీవ్రత కూడా పోలింగ్ శాతం తగ్గడానికి కారణమైంది.
త్వరలో జరిగే ఎన్నికల్లోనూ ఇవే పరిస్థితులు పునరావృతమవుతాయని.. ఓటింగ్ శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. ప్రస్తుతం రాష్ట్రంలో మాడు పగిలే ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి ప్రతాపంతో నిప్పుల వర్షం కురుస్తోంది. ఉదయం 7 గంటలకే 30 డిగ్రీలతో మొదలై మధ్యాహ్నం 12 గంటల వరకే 40, 43 డిగ్రీలకు చేరుతోంది. జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే,.. ఎన్నికల సమయానికి అంటే మే 13 నాటికి మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉంది. దీంతో ఓటర్లు బయటకు వచ్చి ఓటేస్తారా అన్న సందేహాలు నెలకొన్నాయి. పైగా సుదూర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు అంతగా ఆశక్తి చూపరన్న అనుమానం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓటింగ్ శాతం తగ్గే అవకాశముంది. ఈ పరిణామాలు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.


