ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాకినాడ జిల్లా తునిలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్న రాష్ట్ర మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు. యనమల కృష్ణుడు టిడిపిని వీడారు. త్వరలోనే వైసీపీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే తెలుగుదేశం పార్టీతో నాలుగు దశాబ్దాలకుపైగా అనుబంధం ఉన్న యనమల కృష్ణుడు పోలింగ్కు కొద్ది రోజుల ముందు టీడీపీని వీడడం సంచలనంగా మారింది.
యనమల కృష్ణుడు టీడీపీలో పరిచయం అక్కర్లేని పేరు. ప్రత్యేకించి తుని నియోజకవర్గంలో అందరికీ సుపరిచి తమైన నాయకుడు. తెలుగుదేశం పార్టీలో గత 42 ఏళ్లుగా తన సోదరుడు యనమల రామ కృష్ణుడుకు తోడు నీడగా ఉంటూ వస్తున్న నేత. అలాంటి లీడర్ ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. నిజానికి.. యనమల రామకృష్ణుడు టీడీపీలో ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు నెంబర్ టూ గా ఉంటూ వచ్చారన్నపేరు సంపాదించారు. పార్టీతోపాటు ప్రభుత్వంలోనూ పలు కీలక పదవులు చేపట్టి తెలుగుదేశంలో అగ్రనేతగా ఎదిగారు. అయితే ఇదంతా నాణేనికి ఓ వైపేనని వ్యక్తిగతంగా ఎంతో పేరు సంపాదించిన యనమల నియోజకవర్గానికి మాత్రం ఏమీ చేయలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో గత కొన్ని పర్యాయాలుగా ఓటమి పాలవుతూ వస్తున్నారు.
అన్న యనమల రామకృష్ణుడు వరుసగా పరాజయాల పాలవుతుండడంతో అప్పటివరకు తెరవెనుక ఉండిపోయిన ఆయన సోదరుడు యనమల కృష్ణుడు రాజకీయంగా ఫోకస్లోకి వచ్చేశారు. అంతేకాదు గత రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తుని నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా సరే వెనుదిరగకుండా తుని అసెంబ్లీ స్థానానికి టీడీపీ ఇంచార్జ్గా వ్యవహరిస్తూ పార్టీ వ్యవహారాలను చక్కబెడు తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈసారి మాత్రం తుని నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య రంగంలోకి దిగారు. ఈ విషయంలో యనమల పార్టీ అధిష్టానంతో మాట్లాడి ఒప్పించ గలిగారు. దీంతో.. ఇదే అంశంపై యనమల సోదరుల మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు ప్రచారం సాగింది. దీంతో.. చంద్రబాబుతో మాట్లాడించి కృష్ణుడికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇప్పించారు రామకృష్ణుడు. కానీ, అప్పటి నుంచి తమ్ముడి వ్యవహారంపై యనమలతోపాటు ఆయన కుమార్తె దివ్య కూడా కొంతమేర అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. చివరకు కృష్ణుడి అవసరం లేదని భావించి ఆయన్ను పట్టించుకోవడం మానేశారన్న వార్తలు నియోజకవర్గంలో జోరుగా విన్పించాయి.
ఓవైపు అన్న యనమల రామకృష్ణుడు, మరోవైపు దివ్యతో విబేధాల నడుమ అసంతృప్తిగా ఉన్న యనమల కృష్ణుడు గత కొంతకాలంగా పార్టీకి, ప్రచారానికి వెళ్లకుండా ఇంటిలోనే ఉండిపోయారు. చివరకు ఎన్నో తర్జన భర్జనల నడుమ వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన అనుచరులు కొందరు వైసీపీ తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు ఆయన సైతం వైసీపీకి జైకొట్టారు. అయితే పోలింగ్ తేదీకి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో యనమల కృష్ణుడు టీడీపీ వీడడం తునిలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.


