ఒక్కో ఎలక్షన్ ఒక్కో నియోజకవర్గం.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలో ఇదే చెప్పాలి. నిజమే! ఆయన రాజకీయ ప్రస్థానం అలాగే ఉంటుంది. మరి 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నియోజకర్గం నుంచి గెలిచిన ఆయన. ఈ ఐదేళ్లలో ఏం చెప్పారు? ఏం చేశారు? ఆయన పనితీరు ఎలా ఉంది ? అనే వివరాల్లోకి వెళదాం.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న కీలక నగరాల్లో ప్రధానమైనది విశాఖపట్టణం. అక్కడున్న నాలుగు నియోజకవర్గాల్లో ఒకటి విశాఖ ఉత్తరం. ఇక్కడ్నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు గంటా శ్రీనివాసరావు. నాలుగు పార్టీల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో టీడీపీ నుంచి గంటా పోటీ చేశారు. వైసీపీ నుంచి కమ్ముల కన్నపరాజు, జనసేన తరఫున పసుపులేటి ఉషాకిరణ్, బీజేపీ తరఫున పెన్మత్స విష్ణుకుమార్ రాజు రంగంలో దిగారు. ఈ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు 19 వందల నలభై నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం చూస్తే 1999లో టీడీపీ నుంచి రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన.. అనకాపల్లి నుంచి తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు. అనంతరం నియోజకవర్గం మారి 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతం మారిన రాజకీయ పరిస్థితుల్లో మెగాస్టార్గా ఉన్న చిరంజీవి కొత్త పార్టీ ప్రజారాజ్యం స్థాపించారు. దీంతో అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి రంగంలో దిగారు గంటా. నాటి ఎన్నికల్లోనూ విజయం సాధిం చారు. అయితే.. ఆ తర్వాతి పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో మంత్రి పదవి చేపట్టారు గంటా శ్రీనివాసరావు.
2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత మరోసారి టీడీపీలో చేరారు గంటా. భీమిలి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019లో మరోసారి నియోజకవర్గం మారిన గంటా.. విశాఖ ఉత్తరం నుంచి గెలుపొందారు. గత ఐదేళ్లలో నియోజకవర్గం కోసం గంటా శ్రీనివాసరావు ఏం చేశారంటే పెద్దగా చేసిందేమీ లేదన్న వాదన విన్పిస్తోంది. ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చిన ప్పుడు కొత్తగా నియోజకవర్గం మారడం లేదంటే పార్టీ మారి మళ్లీ కొత్త స్థానం నుంచి పోటీ చేయడం గంటాకు సర్వసాధారణమన్న అభిప్రాయం విశాఖ రాజకీయాలను క్షుణ్నంగా పరిశీలించే వారికి ఎవరికైనా ఇట్టే అర్థమవు తుంది.ఈ ఐదేళ్లలో గంటా శ్రీనివాసరావు నియోజకవర్గానికి చేసిందేమిటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇదొక్కటే ఆయన చేసిన ప్రధానమైన పని అన్నది నియోజకవర్గంలో అందరూ చెప్పేమాట. అంతకుమించి చెప్పుకోదగిన పని ఒక్కటి కూడా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంటా చేయలేదన్న విమర్శలున్నాయి.
విశాఖ ఉత్తరం ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు.. 2019లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఇటు ఇటుక తీసి అటుపెట్టలేదన్న విమర్శలున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే నియోజకవర్గంలో డ్రైనేజీలు, కాలువలు, కరెంటు సమస్యలు చాలా ఉన్నాయి. అయినా ఒక్కసారి కూడా ఎమ్మెల్యే వార్డుల్లో తిరుగుతూ ప్రజలను సమస్యల గురించి అడిగిన దాఖలాల్లేవు అంటున్నారు ఇక్కడి ఓటర్లు. ఈ సమస్య ఎక్కడిదాక వచ్చిందంటే, గంటాను నమ్మి ఓటేసినందుకు మాకు తగిన శాస్తే జరిగిందని కొందరు అంటుంటే, కనీసం ఒక్కసారైనా ఎమ్మెల్యే మా ముఖాలు చూసిన పాపాన పోలేదని చెప్పుకొస్తున్నారు మరికొందరు స్థానికులు. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి, మా ఎమ్మెల్యే కనిపించ డం లేదు. తెలిస్తే ఆచూకీ చెప్పండని సెటైరికల్గా అడుగుతున్నారు. ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చ కపోయినా ఎమ్మెల్యేగా గంటా ప్రతిసారీ ఎలా గెలుస్తారంటే, నియోజకవర్గంలో ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు గుప్పించడం ప్రజల్లో నమ్మకం కలిగించడం చేస్తూ ఉంటారన్న ప్రచారం సాగుతోంది. ఇక గెలిచిన తర్వాత ఐదేళ్లూ కాలక్షేపం చేసి ఆ తర్వాత మళ్లీ తీరిగ్గా మరో నియోజకవర్గానికి మారిపోతుంటా రన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు తిరుగు లేని నిదర్శనం అన్నట్లుగా మరోసారి నియోజక వర్గం మారిపోయారు గంటా. రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. ఇలా ఒక్కో ఎన్నిక ఒక్కో నియోజకవర్గం అన్నట్లుగా ఉన్న గంటాకు విశాఖ ఉత్తరం నియోజకవర్గ ప్రజలు వందకు నలభై మార్కులు వేశారు. మరి మళ్లీ నియోజకవర్గం మారి భీమిలి నుంచి పోటీ చేస్తున్న గంటాను ఈసారి కూడా విజయం వరిస్తుందా? లేదంటే మరేదైనా అద్భుతం జరుగు తుందా? త్వరలోనే తేల నుంది.


