సంగారెడ్డి జిల్లా కెమికల్ రియాక్టర్ పేలుడు ఘటనలో బాదితుల కుటుంబాలను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. మరోవైపు SB కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. నిన్న SB కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఐదుగురు మృతి చెందారు. శిథిలాలు తొలగిస్తుండగా మరో మృతదేహం లభ్యమైంది. మృతుడిని కోన్యాలకు చెందిన వడ్డేపల్లి రమేశ్గా గుర్తించారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన 25 మందికి హైదరాబాద్లోని నిమ్స్, కేర్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై బాధిత కుంటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అంటున్నారు.
SB ఆర్గానిక్స్ యూనిట్-1లో కాలంచెల్లిన రియాక్టర్లను ఉపయోగించడం వల్లే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంతో పాటు బాయిలర్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. ఇటీవలే బాయిలర్ వద్ద నామమాత్రపు మరమ్మతులు చేసినా..సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని కార్మికులు అంటున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలో 9 మంది మృతి చెందినట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న 24 పారిశ్రామిక వాడల్లో గత రెండేళ్ల వ్యవధిలో 40 ప్రమాదాలు జరిగాయని పోలీసులు చెప్పారు. రెండేళ్లలో 72 మంది కార్మికులు మృతి చెందగా.. 225 మందికి గాయాలు అయ్యాయి.


