స్వతంత్ర వెబ్ డెస్క్: పార్టీ నేత, ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కు కాంగ్రెస్ పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ఛార్జ్గా కన్హయ్య కుమార్ను కాంగ్రెస్ నియమించింది. కన్నయ్య కుమార్ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి కన్హయ్య కుమార్ నాయకత్వం వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడతుండటం, త్వరలో మధ్యప్రదేశ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పలువురిని కీలక పదవుల్లో నియమించింది. మధ్యప్రదేశ్ లో నలుగురు నేతలను పార్టీ ప్రధాన కార్యదర్శులుగా, మరో నలుగురిని డీసీసీ అధ్యక్షులుగా నియమించింది. గత ఏడాది పంజాబ్ ఎన్నిల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని చక్కదిద్దేందుకు 31 మంది నేతలతో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అంబికా సోని, సుఖీందర్ సింగ్, తాజీందర్ సింగ్ బిట్టు, చరణ్ జిత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మనీశ్ తివారీ సహా పలువురు నేతలు ఉన్నారు.
NSUIను 1971, ఏప్రిల్ 9న స్థాపించారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్, పశ్చిమ బెంగాల్ ఛత్ర పరిషత్ ను విలీనం చేసి ఎన్ఎస్యూఐను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్ఎస్యూఐకు నీరజ్ కుందన్ నేతృత్వం వహిస్తున్నారు.ఢిల్లీ జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కన్హయ్య కుమార్ దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించారు. 1987లో జన్మించిన కన్హయ్య కుమార్ పాట్నా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చదువుతున్న సమయంలో స్టూడెంట్స్ పాలిటిక్స్ లో ఉన్నారు. 2015లో ఢిల్లీలోని జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా, ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. సీపీఐకు 2021లో కన్హయ్య కుమార్ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో అతను పాల్గొన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కన్హయ్య కుమార్ కాలినడకన నడిచారు.


