రాష్ట్ర నూతన హైకోర్టు నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. వివిధ వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. సారవంతమైన భూమిలో హైకోర్టు ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు. వేరే చోట న్యాయస్థానం నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. అదే సమయంలో… యూనివర్సిటీ స్థలంలో హైకోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు హైకోర్ట్ పరిరక్షణ సమితి సభ్యులు.
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థలంలో .. రాష్ట్ర హైకోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు విద్యార్థులు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రేవంత్ సర్కారు.. ఇటీవలె నూతన హైకోర్టు నిర్మాణం కోసం స్థలాన్ని వెతికింది. చివరకు సర్వే నెంబర్ 41, 42, 43,44 లో విస్తరించిన ఉన్న వంద ఎకరాల్లో నూతన హైకోర్టు భవనం నిర్మించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. అయితే.. అది కాస్తా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానిది కావడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీ ప్రాంగణంలోని జయశంకర్ విగ్రహం వద్ద సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు ధర్నాకు దిగారు. వ్యవసాయ పరిశోధనల కోసం ఎంతో సారవంతమైన భూమి ఇక్కడ ఉందని… ఇలాంటి చోట హైకోర్టు నిర్మాణంతో జీవ వైవిధ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు స్టూడెంట్స్. వ్యవసాయ పరిశోధన లకు ఎంతో ఉపయోగపడే భూమిలో నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి పెంచిన వృక్ష సంపద దెబ్బతినే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 55 ద్వారా యూనివర్సిటీ భూముల్నిహైకోర్టు నిర్మాణానికి ఉపయోగించడం సరికాదంటున్నారు వరంగల్ జిల్లాలోని వ్యవసాయ కళాశాల విద్యార్థులు. సర్కారు నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. సారవంతమైన భూముల్లో కాకుండా మరోచోట రాష్ట్ర హైకోర్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు.. యూనివర్సిటీ స్థలంలో హైకోర్టు ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.. హైకోర్టు పరిరక్షణ సమితి సభ్యులు. హైకోర్టు ఏర్పాటుపై ఎలాంటి కమిటీని అధ్యయనానికి నియమించకుండా జీవో నెంబర్ 55ను తీసుకురావ డంపై అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు హైకోర్ట్ పరిరక్షణ సమితి సభ్యులు. వివిధ వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతున్న వేళ మరి ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ సర్కారు పునరాలోచన చేస్తుందా ? లేక వ్యవసాయ విశ్వవిద్యాలయం భూముల్లో హైకోర్టు నిర్మాణం విషయంలో ముందుకే వెళుతుందా ? ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.