మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతిపర్వంపై ఎసిబి విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తీగలాగితే డొంకంతా కదిలింది. ఏసిబి కస్టోడియల్ విచారణలో బినామీలు, అక్రమ ఆస్తులు, బ్యాంకు లాకర్లపై శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.
చేసిన పాపం చెడని పదార్థం. ఇది పెద్దల మాట. అధికారం ఉంది కదా అని అక్రమార్కపర్వాలకు పాల్పడితే, అది తాత్కాలిక సుఖ సంతోషాలు కలగచేయవచ్చు. అయితే, ఆ పాపభారాన్ని మోస్తూనే ఉండాలి, ఓ సమయంలో దండన కు గురవ్వాలి. ఇప్పుడు HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ పరిస్థితి ఈ రీతిగానే మారింది. నాడు అధికారంలో ఉన్న ప్పుడు అక్రమ మార్గంలో ఆర్జించిన ధనం..ఇప్పుడు ఆయన పాలిట శాపంలా మారింది. ఆదాయానికి మించి ఆస్తుల ను సంపాదించిన శివబాలకృష్ణ అక్రమార్జనను ఎసిబి ఇప్పటికే లెక్కకట్టింది. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం సుమా రు వంద కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను ఆయన కలిగివున్నట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ మూడు రోజుల పాట సాగించిన విచారణలో విస్తుబోయే నిజాలు వెల్లడవుతున్నాయి. చంచలగూడ కారాగారంలో వున్న శివబాల కృష్ణను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. తొలి రోజు కస్టడీలో.. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం దాదాపు ఏడు గంటలపాటు విచారణ సాగించింది. ఒక ప్రత్యేక గదిలో బాలకృష్ణను సుదీర్ఘంగా విచారించింది. అక్రమ ఆస్తులు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏ శాఖల్లో ఎవరెవరు ఆయనతో టచ్ లో ఉన్నారనే విషయాలపై విచారణ సాగించినట్టు తెలిసింది. ఎన్ని అక్రమ పర్మిషన్లు మంజూరు చేశారనే విషయాన్ని విచారించినట్టు తెలిసింది.
దాదాపు 75 ప్రశ్నలతో బాలకృష్ణను ఏసీబీ ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలిసింది. అయిదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం శివ బాలకృష్ణను ప్రశ్నించింది. ఈ విచారణను వీడియో,ఆడియోలుగా రికార్డ్ చేశారు. తొలి రోజు విచారణలో శివబాలకృష్ణ వ్యక్తిగత వివరాలు, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆయన అందుకున్న జీతం, శివబాల కృష్ణ పేరుతో ఉన్న ఆస్తుల గురించి ఏసీబీ వివరాలు తెలుసుకున్నట్టు తెలిసింది. ఈ విచారణ అనంతరం తిరిగి ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు.సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను శివబాలకృష్ణ ముందుంచి ఏసీబీ రెండో రోజు విచారణ కొనసాగించింది. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో పెంట రమాదేవి, రాయదుర్గం మై హోం బూజాలో డింగరి కిరణ్ ఆచార్య, హనుమకొండ భవానీనగర్లో సింగరాజు ప్రమోద్కుమార్, మాదాపూర్ సాహితి సుముఖి ఆర్బిట్ ఆపార్ట్మెంట్, హబ్సిగూడ వీవీనగర్లో కొమ్మిడి సందీప్ కుమార్ రెడ్డి పేరుతో ఉన్న ఫ్లాట్ల డాక్యుమెంట్ల గురించి ఏసీబీ విచారణలో ప్రశ్నించారు. బాచుపల్లి శిల్ప ఆర్వీ ధరిస్తా అపార్ట్మెంట్లో జి.సత్యనారా యణ మూర్తి పేరుతో ఉన్న ఫ్లాట్ వివరాలు సేకరించారు. వీటితోపాటు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని సాయి సందీప్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, కొత్తపేట ఆర్కేపురంలోని ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన వివరాలు అడగ్గా వాటితో తనకెలాంటి సంబంధంలేదని శివబాలకృష్ణ చెప్పినట్టు తెలిసింది.
మూడో రోజు విచారణలో శివ బాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అలాగే పలు బ్యాంకు లాకర్లను పరిశీలించారు. అయితే బ్యాంకు లాకర్ల వివరాలు గొప్యంగా ఉంచారు. నాలుగు బ్యాంకు లాకర్లు, బినామీలు, పెట్టుబడులపై ఆరా తీశారు. ఇల్లీగల్ లే అవుట్ అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ తదితర వాటిపై ఆరా తీశారు. శివ బాలకృష్ణ పెట్టుబడులు పెట్టిన రెండు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సంబంధాలపై ఆరా తీశారు. బాలకృష్ణ బినామీలు సత్య, మూర్తితో ఉన్న లింక్స్పై విచారణ జరిపారు. అక్రమ ఆస్తులు, బినామీలపై క్లారిటీ కోసం ప్రశ్నలపర్వాన్ని కొనసాగించారు. ఎసిబి దగ్గరున్న సమాచారం శివబాలకృష్ణ దగ్గర నుంచి వస్తున్న సమాధానాలు.. వీటన్నింటిని టాలీ చేస్తున్నారు. నాలుగో రోజు మరోసారి శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకుని, బాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపైన ఉన్న మూడు లాకర్లను గుర్తించారు. ఈ మూడు లాకర్లు తెరిచాక మరికొన్ని విషయాలు తెలియనున్నాయి. సోదాల సమయంలో నోరు మెదపని శివబాలకృష్ణ, ప్రస్తుత కస్టోడియల్ విచారణలో అధికారుల ప్రశ్నలకు కొద్ది కొద్దిగా సమాధానాలు ఇస్తున్నట్టు తెలిసింది. లాకర్లు, బినామీ ఆస్తులపై క్లారిటీ వస్తే వాటిని ఏసీబీ పక్కాగా గుర్తించనుంది. ఇప్పటికే శివబాలకృష్ణ బినామీ కంపెనీలపై ఆరా తీస్తోంది. శివబాలకృష్ణ నోరు మెదిపి, పూర్తి వివరాలు అందిస్తే, ఆయన హయాంలో వెనుకుండి నడిపించిన రాజకీయ పెద్దలు, ఉన్నతాధికారులు చిట్టా బయటపడడం ఖాయమని తెలుస్తోంది.