ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి, కుమార్తె మీసా భారతి పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగింది. 2004 నుంచి 2009 మధ్య కాలంలో వివిధ భారతీయ రైల్వే జోన్లలో గ్రూప్ ‘డి’ ఉద్యోగాల్లో పలువురు వ్యక్తులను నియమించారు. దీనికి బదులుగా ఈ వ్యక్తులు తమ భూము లను ప్రసాద్ కుటుంబ సభ్యులకు, సంబంధిత సంస్థ ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదలాయించారని ఆరోపణలు ఉన్నాయి.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కుమార్తె, ఎంపీ మీసా భారతి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి సన్నిహితుడు అమిత్ కత్యాల్ లపై మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసింది. ఢిల్లీలోని స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కోర్టు లో ఈ చార్జిషీటు దాఖలైంది. జనవరి 16న ఈ కేసు విచారణ జరుగుతుంది. గత సంవత్సరం నవంబర్ లో కత్యాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కానీ ఈడి ఎదుట హాజరు కాలేదు.