ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకువచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నా లు చేస్తున్నారు. అందులో భాగంగా మరోసారి షర్మిల జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 7 నుంచి 11 వరకు షర్మిల జిల్లాల పర్యటన సాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. పలు నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ పాల్గొననున్నారు. అధికార వైఎస్సార్సీపీ పార్టీపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి తొమ్మిది రోజుల పాటు జిల్లాల్లో షర్మిల పర్యటించి అందరిని కలుపుకుపోతూ.. కీలన నేతలను పార్టీలోకి తీసు కువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి జిల్లా పర్యటను సిద్ధమవుతున్నారు. ఈ నెల 7న బాపట్ల నియోజకవర్గంలో షర్మిల పర్యటిస్తారు. తెనాలి, ఉంగుటూరు,కొవ్వూరు, నర్సీపట్నం, పాడేరు, నగరి నియోజ కవర్గాల్లో బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు.