దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనుకోలేదని కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీలు అన్నారు, కానీ 420 హమీలిచ్చారని చెప్పారు. ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మి బాగా పనిచేసిన వారిని ఓడించారని అన్నారు. పనుల మీద కంటే ప్రచారం మీద దృష్టి పెడితే తామే గెలిచే వాళ్లామని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రచారం గురించి తాము ఏనాడు ఆలోచించలేదన్నారు.
రేషన్ కార్డులు ఇవ్వలేదు అని తప్పుడు ప్రచారం చేశారన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల 47 వేల 479 రేషన్ కార్డులు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్. 29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచినా ఏనాడు చెప్పుకోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని కేటీఆర్ అన్నారు.
స్థానిక సంస్థల నుంచి మెదలుకొని, అసెంబ్లీ దాకా బలమైన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. తామది బలమైన ప్రతిపక్షం అన్న కేటీఆర్… మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలే మన గెలుపునకు సోపానం కావాలన్నారు. ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి అనేక మాటలు మాట్లాడారు. రుణం ఉన్నవాళ్లే కాదు, వ్యవసాయ రుణం లేనివాళ్లు కూడా తీసుకోండని సూచించారు. అధికారంలోకి రాగానే వెంటనే రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులంటూ, శ్వేతపత్రాలంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.