పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు లేవని, మధ్యంతర బడ్జెట్ లో కొత్త పన్నులేవీ విధించబోవడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2024-25 మధ్యంతర బడ్జెట్ ను ఆర్థికమంత్రి లోక్ సభలో ప్రవేశ పెట్టారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త పన్నుల జోలికి వెళ్లలేదు. బడ్జెట్లో ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లలో ఎటు వంటి మార్పులు లేవు. వేతన జీవులను ఉరట కల్పించారు. బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు, కొత్త , పాత ఆదాయపు పన్ను విధానాలకు పన్ను శ్లాబ్ రేట్లను యథాతథంగా ఉంచారు. బడ్జెట్ అనగానే జీతాలపై ఆధారపడే ఉద్యోగులు ఆదాయ పన్ను విధానంలో మార్పులపైనే ఆలోచిస్తారు. వారిని ఆర్థికమంత్రి నిరాశ పరచకపోవడం ఈ మధ్యంతరబడ్జెట్ లో కీలక అంశం.
ఉద్యోగ తరగతికి 7 లక్షల రూపాయల వరకు ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ లభిస్తుంది. ఇతరవర్గాల్లో 3 నుంచి 6 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం పన్ను , 6లక్షల నుంచి 9 లక్షల రూపాయల ఆదాయంపై 10 శాతం పన్ను, ఉంటుంది. 9-12 లక్షల మధ్య ఆదాయం ఉన్న వర్గాలకు 15 శాతం , 12-15 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 10శాతం, రూ.15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్ను గతంలో విధించారు. ఆ పన్నుల విధానమే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుంది.
కొత్త బడ్జెట్ ప్రతిపాదనల వల్ల ఏఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అన్నది ఆసక్తి కల్గించే అంశం. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, కంప్రెస్డ్ గ్యాస్, రొయ్యల దాణా, ఎలక్ట్రిక్ వాహనాలకోసం లిథియం అయాన్ సెల్స్ తయారు చేసే యంత్రాల ధరలు తగ్గుతాయి. అలాగే ల్యాబ్ లో రూపొందించే కృత్రిమ వజ్రాల ధరలు తగ్గుతాయి. అలాగే, సెట్ టాప్ బాక్సులు, , ఈవీల దిగుమతి విడిభాగాలు, కెమెరా మాడ్యూల్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, దిగుమతి చేసుకున్న ఉన్ని ఫైబర్, ఉన్ని టాప్ లపై పన్నులు తగ్గుతాయి. దిగుమతి చేసుకునే రక్షణ పరికరాలపైన పన్ను తగ్గుతుంది. గృహ నిర్మాణానికి అవసరమైన వస్తువులు కాస్త తగ్గుతాయి.
బడ్జెట్ ప్రతిపాదనల వల్ల పెట్రోలు, డీజిల్ మరింత ప్రియం అవుతాయి. విమాన ప్రయాణం చార్జీలు తీవ్రంగా పెరగనున్నాయి. అలాగే వస్త్రాల ధరలు పెరుగుతాయి. అలాగే సిగరెట్లు, హుక్కా, నమిలే పొగాకు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. సైకిళ్లు. రోల్డ్ గోల్డ్ , ఆభరణాలు, ఎలక్ట్రిక్ చిమ్నీలు, రాగి వస్తువులు, రాగి స్క్రాప్ ధరలు పెరుగుతాయి. ఏడాదిలో కోటి రూపాయలకు పైగా నగదు ఉపసంహరణ పై చార్జీలు పెరుగుతాయి. పూర్తిగా దిగుమతి చేసుకున్న కార్లు, స్ప్లిట్ ఏసీలు, , దిగుమతి చేసుకున్న ఆటో విడిభాగాలు, దిగుమతి చేసుకున్న స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులు, దిగుమతి చేసుకున్న బంగారం, ఇతర విలువైన లోహాలు, ప్రింటెడ్ పుస్తకాలు, దిగుమతి చేసుకున్నప్లగ్ లు, సాకెట్లు స్విచ్ లు, సీసీటీవీ కెమెరాలు, లౌడ్ స్పీకర్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పన్నులు వడ్డించేందుకు ధైర్యం చేయలేదు. ఇది 2024-25 మధ్యంతర బడ్జెట్ కావడం కొత్త పన్నులేమీ విధించకుండా.. పాతపన్నుల విధానాన్నే కొనసాగించారు. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం జూన్- జూలై నెలల్లో ప్రవేశ పెట్టే పూర్తి బడ్జెట్ పై కొత్త పన్నులు, వడ్డింపులు ఉండవచ్చు.