సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ జగన్ పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను ప్రధానికి వివరించనున్న సీఎం జగన్.. రాష్ట్ర తాజా రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. రాష్ట్ర అభివృద్ధి అంశాలు, పోలవరం నిర్మాణం, రాష్ట్ర లోటు బడ్జెట్, వెనుకబడిన జిల్లాలు, వైద్య కాలేజీలు సహా పలు అంశాలపై పదే పదే కేంద్రానికి లేఖలు అందిస్తూ వస్తున్నారు సీఎం జగన్.. ఇప్పు డు రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరం అనే విషయాన్ని కేంద్రం పెద్దలకు వివరించనున్నారని తెలుస్తోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ జగన్ భేటీ అయ్యే అవకాశముందని వైసీపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన కాగానే జరుగుతున్న జగన్ హస్తిన పర్యటన హాట్ టాపిక్గా మారింది. షర్మిల చేపట్టిన ప్రత్యేక హోదా నిరసన స్వరంతో జగన్ పర్యటన రాష్ట్రానికి ప్రయోజనకరంగా మారుతుందా అన్న ఆసక్తి నెలకొంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అన్నది ఉత్కంఠగా మారింది. లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ ఏపీ నేతల హస్తిన పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగియగానే జగన్ హస్తినలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.