ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రగులుతోంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ చరిత్ర కలిగిన నాయకుల వారసురాళ్లు దిగుతున్నారు. ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నేత రాజశేఖర్ రెడ్డి వారసురాలు షర్మిల రెడ్డి, మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ వారసురాలు పురంధేశ్వరి రెండు కీలక జాతీయ పార్టీల్లో కీలక పదవుల్లో ఉంటూ రాజకీయ చక్రం తిప్పబోతున్నారు.
దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన ఏకైక పార్టీ కాంగ్రెస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ పొందిన నాయకుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి. ఆయన మరణాంతరం కంటికి కనపడని శత్రువుతో యుద్ధం చేసిన ఆయన వారసుడు జగన్ మోహన్ రెడ్డి నూతన ఆంధ్రప్రదేశ్ కు 2019 లో ముఖ్యమంత్రి గా ఎన్నికయ్యారు . ఇక 2024 ఎన్నికల్లో రాజన్న మరో వారసురాలు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యత చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్ ఆర్ టీపీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు షర్మిల.
2024 ఎన్నికల్లో షర్మిల ఎవరి ఓట్లను చీల్చేందుకు సిద్ధం అవుతున్నారో అని ప్రతి ఒక్కరూ ఉత్కంఠతో చూస్తు న్నారు. గతంలో జగన్ వదిలిన బాణం గా పేరొందిన షర్మిల ఇప్పుడు ఎవరికి గుచ్చుకునేందుకు దూసుకెళ్తుందో అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీ నెగ్గేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయను కున్నా,.. పవన్ కల్యాణ్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. దీంతో జగన్ వైసీపీ ప్లాన్ బి అమలుకు సిద్ధం అయింది. సీట్లు కోల్పోయి, అసంతృప్తిగా ఉన్న వైసీపీ సిట్టింగ్ నాయకులను కాంగ్రెస్ లోకి పంపిస్తే ఓట్లు చీలి వైసీపీకి లబ్ధి పొందే అవకాశాలు ఉండవచ్చునని భావించారు. అందుకే నమ్మిన బంటు ఆళ్ల రామ కృష్ణా రెడ్డితో రాజకీయ చదరంగంలో జగన్ తొలి ఎత్తు వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరో జాతీయ పార్టీ బీజేపీ . ఏపీ శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి 2024 ఎన్నికల వ్యూహం మొదలుపెట్టారు. తండ్రి మరణాంతరం నందమూరి వారసులు ఎవరూ టీడీపీ పగ్గాలు కానీ, సీఎం పదవి కానీ చేపట్టలేదు. కృష్ణా జిల్లాతో నందమూరి కుటుంబానికి ఒక అనుబంధం ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కావటం ఓ కారణం. అక్కడి ఎన్టీఆర్ వీరాభిమానులు.. ఎన్టీఆర్ అంటే ప్రాణం పెట్టేవారిని ఓటు బ్యాంక్ గా మార్చుకునే అవకాశం పురందేశ్వరికి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. ఏళ్లుగా నారా వారి కుటుంబానికి కట్టు బానిసగా ఉన్న నందమూరి కుటుంబంలో ఇప్పుడైనా నందమూరి వారసురాలు రాకతో మార్పులు ఉంటాయా లేకపోతే కట్టు బానిస సిద్ధాంతం కొనసాగుతుందా.. అన్న సందేహాలు మొదలవుతున్నాయి.
నందమూరి తారకరామారావు వారసురాలిగా మహా నేత ఆశయాలు మరొకసారి గుర్తు చేసేలా పురంధేశ్వరి కృషి చేస్తారా లేకపోతే టీడీపీ- జనసేనతో పొత్తు పెట్టుకుని నారా వారికీ బానిస అవుతారా అన్నఉత్కంఠ అభిమానుల్లో ఉంది. ఒకవేళ పొత్తు లేకపోయినా నారా కుటుంబం గెలవటానికి అంతర్గతంగా కృషి చేస్తే మాత్రం మరొకసారి నారా కుటుంబా నికి సాయం చేసినట్లువుతుంది. 2024 పార్లమెంటు,అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం పొత్తు వ్యవ హారం లో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయటానికి పురంధేశ్వరి తనవంతు కృషి చేస్తు న్నారు. పురంధేశ్వరి అధ్యక్షతన రాష్ట్ర బీజేపీ బలమైన శక్తిగానే దూసుకెళ్తోంది. బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయిస్తుందో చూడాలి.
రాజకీయ వారసురాళ్లు పురంధేశ్వరి, షర్మిల రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది కోటి డాలర్ల ప్రశ్న. ఒకరు రాయలసీమలో మంచి పట్టు ఉన్న నేత వారసురాలు కాగా, ఇంకొకరు రాజకీయ చైతన్యానికి పేరొం దిన కృష్ణా మండలంలో చక్రం తిప్పిన నాయకుని వారసురాలు. జనసేన చేయలేని పనిని వీరుచేస్తారా.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ ని వీరు ఇరువురు చీలుస్తారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ . ఈ వారసురాళ్ల సత్తా ఏంటో తెలిసే సమయం ఆసన్నమైందనే చెప్పాలి. వైసీపీ వ్యతిరేక ఓట్లు ఎవరికి పడతాయో చూడాలి.