కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 140 స్థానాల్లో 100 చోట్ల ముందంజలో ఉండటంతో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.పార్టీల కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో అధికార మార్పు దిశగా సంకేతాలు కనిపిస్తుండటంతో, తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) స్పందిస్తూ… కేరళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. తాము ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. సునాయాసంగా మెజారిటీ సాధిస్తామని మీడియాతో చెప్పారు. సీఎం అభ్యర్థి విషయంపై ప్రశ్నించగా, తమ వద్ద పలువురు అర్హులైన నాయకులు ఉన్నారని తెలిపారు. ఫలితాలు పూర్తయ్యాక మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) గెలిచిన ఎమ్మెల్యేలతో చర్చించి, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
ఇక మరోవైపు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) 38 స్థానాల్లో, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) పోటీ చేస్తున్న ధర్మదం నియోజకవర్గంలో ఆయన వెనుకంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రషీద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


