తమిళనాడు రాజకీయాలు గంట గంటకూ ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. హంగ్ అసెంబ్లీ ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి మధ్య టీవీకే (తమిళగ వెట్రి కళగం) అధినేత విజయ్ కీలక అడుగులు వేస్తున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.
ఇప్పటికే రెండు సార్లు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను విజయ్ కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరినప్పటికీ, అవసరమైన సంఖ్యాబలం తప్పనిసరిగా చూపించాల్సిందేనని గవర్నర్ తేల్చిచెప్పారు . 234 సభ్యుల అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇప్పటివరకు టీవీకే సమీకరించలేకపోయింది. దీంతో గవర్నర్ నుంచి ఇంకా స్పష్టమైన ఆహ్వానం రాలేదు.
ఈరోజు రాజకీయ పరిణామాల్లో అత్యంత కీలక అంశం లెఫ్ట్ పార్టీలు, వీసీకే వైఖరి. ఇప్పటివరకు ఈ పార్టీలు తటస్థ ధోరణి పాటిస్తున్నప్పటికీ, టీవీకేకు మద్దతు ఇవ్వాలా? లేక దూరంగా ఉండాలా? అన్న దానిపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లెఫ్ట్ పార్టీల మద్దతు లభిస్తే విజయ్కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉండొచ్చు.
మరోవైపు అన్నాడీఎంకే కూడా వేగంగా రాజకీయ వ్యూహాలు రచిస్తోంది. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఇప్పటికే పుదుచ్చేరిలో ఉన్న ఎమ్మెల్యేలకు వెంటనే చెన్నైకి తిరిగి రావాలని ఆదేశించారు. రిసార్ట్ రాజకీయాలకు తెరతీసిన అన్నాడీఎంకే, ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది. డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా పళనిస్వామి శిబిరంలో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గవర్నర్పై తీవ్ర విమర్శలు చేస్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం ఏర్పాటును గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని లోక్భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్, పార్టీ కార్యాలయం, గవర్నర్ భవన్ పరిసరాల్లో భద్రతను భారీగా పెంచారు. ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని టీవీకే నేతలు చెబుతున్నారు.
ఇక విజయ్ తన ఎమ్మెల్యేలతో భేటీలో తదుపరి వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. అవసరమైతే మరోసారి గవర్నర్ను కలవడం, మద్దతు కోసం ఇతర పార్టీలతో చర్చలు వేగవంతం చేయడం, లేదా ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
తమిళనాడు రాజకీయ సంక్షోభం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు? డీఎంకే-అన్నాడీఎంకే కలిసి వస్తాయా? లేక విజయ్ అనూహ్య మద్దతు కూడగట్టగలడా? అన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది.


