హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్లో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్యను ఇంట్లో పనిచేసే పనిమనిషి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. హత్య అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదును దోచుకుని నిందితురాలు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం… జూబ్లీహిల్స్లోని ఐఏఎస్ క్వార్టర్స్లో నివసిస్తుంది వినయ్ రంజన్ కుటుంబం. ఇంట్లో పనిచేస్తున్న మహిళకు ఇంట్లో ఉన్న నగదు, బంగారం గురించి ఆమెకు పూర్తి సమాచారం ఉందని తెలుస్తోంది.
ఘటన జరిగిన రోజు ఇంట్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య ఒంటరిగా ఉన్న సమయంలో నిందితురాలు దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పదునైన ఆయుధంతో దాడి చేసి ఆమెను హత్య చేసిన తర్వాత, ఇంట్లోని ఆభరణాలు, నగదు తీసుకుని అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
సమాచారం అందుకున్న వెంటనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఇంట్లో ఆధారాలను సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్డేటా, నిందితురాలి గత వివరాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు నిందితురాలి కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, బయటి ప్రాంతాలపై నిఘా పెంచారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. నగరంలో భద్రతపై మరోసారి చర్చకు దారితీసిన ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


