పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 15న వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబరు నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించినా కొన్నిచోట్ల భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో రెండు విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2014-19లో టీడీపీ హయాంలో 5రూపాయలకే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను.. గత వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వీటిని తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేసి, వాటిలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు విడుదల చేసింది. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన, అసలు పనులే ప్రారంభించనిచోట కొత్త క్యాంటీన్ భవన నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. తొలివిడతగా వంద క్యాంటీన్లను స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడానికి ఇటీవల టెండర్లు కూడా పిలిచారు. మొత్తం ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలని పుర, నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశించింది.