తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అఫిడవిట్ అంశం హాట్ టాపిక్గా మారింది. శాసనసభ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా సమర్పించే అఫిడవిట్లో సరైన వివరాలు అందించలేదనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జలగం వెంకట్రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు బరిలో దిగాగా.. జలగంపై వనమా గెలుపొందారు. అయితే నామినేషన్ సందర్బంగా వనమా సరైన వివరాలు సమర్పించలేదంటూ జలగం వెంకట్రావు హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం.. 2023 జూన్లో వనమా ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. దీంతో ఆ ఎన్నికల్లో రెండో స్ధానంలో నిలిచిన తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని శాసనసభ కార్యదర్శిని జలగం కోరారు. ఇంతలో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది.
జలగం వర్సెస్ వనమా కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈసారి జరిగిన ఎన్నికల్లో.. నామినేషన్ల అంశంపై అన్ని నార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. బీఆర్ఎస్ తమ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ పత్రాల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసిందంటే ఏ మేర ఫోకస్ పెట్టిందో అర్థమైపోతుంది. మరోపక్క కొత్తగూడెంలో నామినేషన్ల దరఖాస్తు పరిశీలన హాట్ హాట్గా సాగింది. ఈ స్థానం నుంచి మొత్తం 36 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సీపీఐ అభ్యర్ధి కూనంనేని సాంబశివరావు, బీఎస్పీ అభ్యర్ధి కామేశ్తో పాటు మరి కొందరు అభ్యర్ధులు అఫిడవిట్లో సమర్పించిన అంశాలపై మరో అభ్యర్ధి జలగం వెంకట్రావు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల అధికారులు రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిణామాల తర్వాత ఇప్పుడు హైకోర్టులో అఫిడవిట్లపై ఆరోపణలు దాఖలు కావడంతో మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.
వనమా వర్సెస్ జలగం వివాదం సుప్రీంకోర్టులో ఉండగానే గతేడాది నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున వనమా, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున జలగం పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్ధి కూనంనేని సాంబశివారావు విజయం సాధించారు. నామినేషన్ అఫిడవిట్లో సీపీఐ అభ్యర్ధి కూనంనేని సాంబశివరావు సరైన వివరాలు వెల్లడించలేదంటూ నందూలాల్ అగర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. కూనంనేనితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, గవిగోళ్ల మధుసూదన్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యే దానం నాగేందర్పై ఈ తరహా ఆరోపణలతో కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కూనంనేనితో పాటు మిగిలిన ఐదుగురికి నోటీసులు జారి చేసింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.