స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో టెరరిస్ట్ సంచారం ఉన్నట్లు వచ్చిన సమాచారం రూమర్స్ అని తేల్చి చెప్పారు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. మెయిల్ ద్వారా వచ్చింది ఫేక్ న్యూస్ అని, వాటిని ఎవరూ నమ్మాల్సిన పనిలేదని తెలిపారు. ఎవరో కావాలని మెయిల్ పంపినట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కాగా, సోమవారం తిరుమలలో టెరరిస్ట్ సంచారం ఉన్నట్లు పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భధ్రతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయ పురవీధులు, ఏడు కొండల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పరిశీలించారు.