అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా మొదలయ్యాయి. ఇంకా చెప్పాలంటే మాటల మంటలతో సభ హోరెత్తింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అదే సమయంలో సీఎం రేవంత్ కూడా బీఆర్ఎస్ పాలనలో నెలకొన్న పరిస్థితులను సభలో వివరించారు. గత పదేళ్లలో జరిగిన విధ్వంసం గురించే గవర్నర్ ప్రసంగంలో పెట్టినట్లు ప్రభుత్వం చెప్పడంతో సభలో పరిస్థితి వేడెక్కింది.
అధికార పక్షం చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కేటీఆర్. ప్రధానంగా విద్యుత్ విషయంలో అధికార పార్టీ చేసిన కామెంట్లకు లెక్కలతో సహా వివరించారు. విద్యుత్ సంస్థలను 81 వేల కోట్ల మేర అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోందంటూ మొదలు పెట్టిన కేటీఆర్.. ఒక్కో అంశం వారీగా గణాంకాలను చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చినప్పుడు 2,700 మెగావాట్ల కరెంటు లోటు వుందన్న ఆయన.. ట్రాన్స్ కో ఆస్తులు…24 వేల కోట్ల మేర ఉన్నట్లు వెల్లడించారు. ఇక, జెన్కో ఆస్తులు 52 వేల కోట్లు ఉన్నాయన్నారు. కేవలం అప్పుల గురుంచి చెబుతూ…ఆస్తుల విషయాన్ని కావాలనే ప్రస్తావించడం లేదన్నారు కేటీఆర్.
బీఆర్ఎస్ పాలనలో యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు ఎమ్మెల్యే కేటీఆర్. అప్పులను బూచిగా చూపిస్తూ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో గృహ వినియోగదారులపై విద్యుత్ భారం వేయలేదన్న ఆయన… మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆస్తులను అప్పులను వేరుగా చేసి చూడొద్దంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. దేశ జీడీపీ 51 శాతం ఉంటే.. తెలంగాణ జీడీపీ 27 శాతానికి పెగా ఉందన్న విషయాన్ని సభలో గుర్తు చేశారాయన.
రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శించండి కానీ, తెలంగాణ ప్రతిష్టను దిగజార్చకండి అంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే కేటీఆర్. దీంతో.. సభ మరింత వాడీవేడీగా సాగింది.