Y.S.Sharmila | తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలకు దిక్కులేదు కానీ… దొర గారు పక్క రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలను కాపాడే పనిలో పడ్డాడని సీఎం కేసీఆర్ పై సెటైరికల్ పంచ్ లు వేశారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్. షర్మిల. ట్విట్టర్ లో సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ‘ప్రైవేటీకరణ కాకుండా ఆపుతడట. రాష్ట్ర సొమ్ముతో పెట్టుబడులు పెడతాడట. అక్కడ ఉద్యోగులను ఆదుకుంటాడట. మరి మన రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతేంది దొర? ఇక్కడ రోడ్డున పడ్డ వేలాది కార్మికుల కుటుంబాలు నీ కండ్లకు కనపడడం లేదా?’ అంటూ పంచులు విసిరారు. గెలిస్తే 100రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని మోసం చేశావ్. అజంజాహీ మిల్స్, పేపర్ ఫ్యాక్టరీలకు పునర్వైభవం తీసుకొస్తానని దగా చేశావ్. ఎన్నడో మూతపడిన IDPL, HMT, HCL,ఆల్విన్, ప్రాగటూల్స్ లాంటి కంపెనీలను తెరిపించడం చేతకాలేదు… అంటూ విరుచుకుపడ్దారు. నీకు దమ్ముంటే.. ముందుగా ఇక్కడ మూత పడిన పరిశ్రమలను తెరిపించు. రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకో. కేంద్రం మెడలు వంచి బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించు. కేంద్రం ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తదన్న మీ హామీని నిలబెట్టుకో… అంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.