స్వతంత్ర వెబ్ డెస్క్: ఆలయ భూములు వేలం నిర్వహించే క్రమంలో ఒక మహిళ పురుగుల మందు తాగడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా ముద్దునూరు మండలం పెద్ద దుద్యాల గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని శ్రీవరదరాజులస్వామి ఆలయానికి సంబంధించి 130 ఎకరాల భూములకు దేవాదాయశాఖ అధికారులు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వందేళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు ఇప్పుడు వేలం పాట నిర్వహించడం ఏంటని.. వేలం నిర్వహించడానికి వీలు లేదని సాగు చేసుకుంటున్న గ్రామస్థులు ఆందోళనకు దిగారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ప్రోద్బలంతోనే దేవాదాయశాఖ అధికారులు ఆలయం భూములకు వేలంపాట నిర్వహిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే సాగు చేసుకుంటున్న భూములకు వేలం పాట నిర్వహిస్తే జీవనోపాధి కోల్పోతామని భావించిన మహిళలు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో ఇద్దరు మహిళలు పోలీసుల ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఓ మహిళ నుంచి పురుగుల మందు డబ్బా లాక్కున్నారు. మరో మహిళ పురుగుల మందు తాగడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. మరో యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా చేరుకొని గ్రామస్థులను చెదరగొట్టారు.