తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ, ఏపీలో ఎండతీవ్రతతో పాటు వడగాల్పులు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండగా, మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపింది. రేపు 253 మండలాల్లో వడగాల్పులు, 5 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పలు జిల్లాల్లో ఎండల దాటికి ప్రజలు అల్లాడుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడితో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వేసవి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.