నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ఓ మంచినీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హిల్కాలనీ విజయవిహార్ సమీపంలోని సుమారు రెండు వందల నివాస గృహాలకు తాగునీటి కోసం NSP నీటి సరఫరా విభాగం ట్యాంకును నిర్మించింది. దాహం తీర్చుకోవటానికి ఈ ట్యాంకు వద్దకు వచ్చిన కోతులు అందులోకి దిగాయి. బయటికి రావటానికి అవకాశం లేకపోవటంతో మృత్యువాత పడ్డాయి. ట్యాంకు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారమిచ్చారు. సుమారు 30 కోతుల వరకు బయటకు తీశారు. ఇన్ని రోజులూ ఆ నీటినే తాగమని, అనారోగ్యానికి గురవుతామేమోనని కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ సిబ్బందికి ఉన్నా.. ఏనాడూ అలాంటి చర్యలు నిర్వహించలేదని స్థానికులు ఆరోపించారు.