రష్యా పర్యటన ముగించుకుని మంగళవారం యూరప్లోని ఆస్ట్రియా చేరుకున్న మోదీ..అక్కడి దేశాధినేతలతో చర్చలు జరిపారు. అలాగే,.. ఆస్ర్టియాలోని భారత సంతతి ప్రజలతోనూ సమావేశమయ్యారు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆ దేశ ఫెడరల్ చాన్స్లర్ కార్ల్ నెహామర్తో భేటీ అయిన మోదీ ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అనంతరం జరిగిన ప్రెస్మీట్ ద్వారా ఇది యుద్ధాల కాలం కాదని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు ప్రధాని మోదీ. యుద్ధరంగంలో సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు దొరకవని.. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయా దేశాల మధ్య శాంతి ప్రక్రియ కోసం ఎలాంటి సహకారం కోసమైనా భారత్, ఆస్ట్రియా సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. టెర్రరిజాన్ని ఇరుదేశాలూ తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్పష్టం చేశారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు.
రష్యా పర్యటన ముగించుకుని మంగళవారం యూరప్ లోని ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చేరుకున్న మోదీకి అక్కడి ఘనస్వాగతం లభించింది. వియన్నా ఎయిర్ పోర్టులో ఆస్ట్రియన్ విదేశాంగ మంత్రి స్వాగతం పలికారు. అక్కడ గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ఆస్ట్రియన్ కళాకారులు వందేమాతరం ఆలాపనతో మోదీకి గ్రాండ్ వెల్ కం చెప్పారు. ఇక టూర్లో భాగంగా భారత సంతతితోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కాగా, గత 41 ఏండ్లలో ఆస్ట్రియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అధికారికంగా పర్యటించారు.