ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్( Akhilesh Yadav) సవతి సోదరుడు ప్రతీక్ యాదవ్( Prateek Yadav) మృతిపై పోస్టుమార్టం నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ( King George’s Medical University) విడుదల చేసిన నివేదిక ప్రకారం… “మాసివ్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం కారణంగా కార్డియోరెస్పిరేటరీ కొలాప్స్” వల్ల ప్రతీక్ యాదవ్ మరణించినట్లు పేర్కొన్నారు.
పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అంటే ఊపిరితిత్తుల ధమనుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల రక్తప్రసరణ ఆగిపోవడం. సాధారణంగా కాళ్లలో లేదా శరీరంలోని ఇతర భాగాల్లో ఏర్పడిన రక్త గడ్డలు ఊపిరితిత్తులకు చేరడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
పోస్టుమార్టం నివేదికలో ప్రతీక్ యాదవ్ శరీరంపై ఆరు “అంటీమార్టమ్” గాయాలు ఉన్నట్లు వెల్లడించారు. ఛాతీ భాగం, కుడి చేతి కింది భాగం, కుడి మోచేయి, ముందుచేయి, ఎడమ మణికట్టు వద్ద గాయాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటిలో కొన్ని గాయాలు ఐదు నుంచి ఏడు రోజుల కిందటివని, మరికొన్ని ఒక రోజు పాతవని వైద్యులు తెలిపారు.
ప్రతీక్ యాదవ్కు కాలేయం, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం. గతంలో పలుమార్లు లక్నోలోని మెదాంత ఆస్పత్రి(Medanta Hospital) లో చికిత్స పొందారు.
అసలేం జరిగింది?
ప్రతీక్ యాదవ్ మరణించిన రోజు ఉదయం 6:15 గంటలకు కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించగా… అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటన సమయంలో ఆయన భార్య, బీజేపీ నాయకురాలు అపర్ణ యాదవ్( Aparna Yadav ) నగరంలో లేరు.
లక్నో సివిల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జీసీ గుప్తా మాట్లాడుతూ… “ప్రతీక్ యాదవ్ను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ఆయన మరణించారు. అవసరమైన వైద్య ప్రక్రియలు పూర్తి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాం” అని తెలిపారు.
ఇక అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా తన సోదరుడికి నివాళులర్పించారు. “ప్రతీక్ యాదవ్ మృతి తీవ్ర విషాదకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
1988లో జన్మించిన ప్రతీక్ యాదవ్ రాజకీయాల కంటే ఫిట్నెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై ఆసక్తి చూపారు. 2011లో అపర్ణ బిష్ట్ను వివాహం చేసుకున్నారు. అయితే అపర్ణ యాదవ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ తర్వాత బీజేపీలో చేరారు. వారి కుటుంబ విభేదాలు అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.
ఈ ఏడాది ప్రారంభంలో ప్రతీక్ యాదవ్ సోషల్ మీడియాలో కుటుంబ సంబంధాలపై వ్యాఖ్యలు చేయగా… జనవరి 28న భార్యతో తిరిగి కలిసినట్లు ప్రకటించారు.


